కేరళకు చెందిన ప్రముఖ సాహితీవేత్త అక్కితమ్ అచ్యతన్ నంబూద్రి 2019 జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 93 ఏళ్ల మలయాళ కవిత్వంలో ఆధునికతను తీసుకువచ్చిన ‘అక్కితం’ ను జ్ఞాన్ పీఠ్ అవార్డు వరించింది. జి శంకర కురుప్, ఠాఖాజి, ఎస్కె పొట్టెకట్, ఎంటీ వాసుదేవన్ నాయర్ మరియు ఒఎన్వి కురుప్ తర్వాత ఈ అవార్డును గెలుపొందిన 6 వ మలయాళ రచయిత అక్కితం.
నేపథ్యం
మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్, కుమారనెల్లూర్లో 1926, మార్చి 18న జన్మించారు. మలయాళ కవిత్వంలో తనకంటూ గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్న అచ్యుతన్…కవిత్వంతోపాటు సాహిత్యం, నాటక రంగం, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, అనువాదం తదితర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. అతని రచనలలో “ఇరుపతం నూట్టండింటే ఇతిహాసం” (20 వ శతాబ్దపు గొప్పపురాణం) ఒక మైలురాయి.
అచ్యుతన్ ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. వాటిలో 45 పద్యాలతో కూడిన ‘ఖండ కావ్యాలు’, ‘కథా కావ్యాలు’, ‘చరిత కావ్యాలు’, పాటలు ఉన్నాయి. ఆయన రచించిన వాటిలో ‘వీరవదమ్’, ‘బలిదర్శనమ్’, ‘నిమిష క్షేత్రమ్’, ‘అమృత ఖటిక’, ‘అక్కితమ్ కవితక’, ‘ఎపిక్ ఆఫ్ ట్వంటీయత్ సెంచరీ’, ‘అంతిమహాకలమ్’ బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కితమ్ కవిత్వం కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్విక, నైతిక విలువల ముద్రలు కనిపిస్తాయి. సంప్రదాయ, ఆధునికతకు మధ్య వంతెనలా ఉంటూ.. వేగంగా మారుతున్న సమాజంలోని మానవ భావోద్వేగాలను లోతుగా వివరిస్తాయి. ఆయన రచనలు అనేక భారతీయ, విదేశీ భాషల్లోనూ అనువాదమయ్యాయి.
మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.