సాహిత్యప్రేమి, సంస్కరణశీలి…పీవీ

                                                                            …. కల్లూరి భాస్కరం  (9703445985)

పీవీ నరసింహారావుగారి గురించి మాట్లాడుకునేముందు ఒక చారిత్రకవిశేషాన్ని చెప్పుకోవాలి.  ప్రాచీనకాలంలో కానీ, మధ్యయుగాలలో కానీ ఢిల్లీ రాజధానిగా దేశం మొత్తాన్ని ఒక రాజవంశం, లేదా ఒక వ్యక్తి పరిపాలించిన ఉదాహరణ లేదు. బ్రిటిష్ పాలకులకు కూడా ఆ అవకాశం పూర్తిగా లభించలేదు. అప్పట్లో అయిదువందలకు పైగా సంస్థానాలు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే దేశం మొత్తాన్ని ఏలే అవకాశం పాలకులకు లభించింది. ఉత్తరభారతం నుంచి ఆ అవకాశం పొందిన తొలి వ్యక్తి ‘పండిట్’ జవహర్లాల్ నెహ్రూ అయితే, దక్షిణభారతం నుంచి ఆ అవకాశాన్ని అందుకున్న తొలి వ్యక్తి ‘పండిత’ పీవీ నరసింహారావు. ఇంకా మరెన్నో విషయాలలో వారి మధ్య పోలికలు కనిపిస్తాయి. తమ రాజకీయ, పరిపాలనా జీవితంలో కొన్ని మౌలిక ఆలోచనలు చేసినవారుగా, సంస్కరణశీలురుగా ఇద్దరూ పేరుపొందారు. దేశం స్వతంత్రమై ఫెడరల్ స్వభావం కలిగిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని తెచ్చుకుని సరికొత్త ఆశలతో, వినూత్నమైన మార్గంలో అడుగుపెట్టబోతున్న కీలకఘట్టంలో దేశానికి దిశానిర్దేశం చేసే అవకాశం నెహ్రూకు లభించింది. అలాగే, బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన స్థాయికి దేశఆర్థికత అణగారిపోయిన దశలో సత్వరచర్యలు తీసుకుని ఆర్థికపరిస్థితిని చక్కదిద్దే అవకాశం పీవీకి లభించింది. సాహిత్యాభిరుచిలోనూ, రచనలు చేయడంలోనూ కూడా నెహ్రూ, పీవీల మధ్య పోలిక చక్కగా కుదురుతుంది. అప్పట్లో అంతర్జాతీయంగా నెహ్రూకు ఉన్నంత ప్రతిష్ఠ కానీ, అంతర్జాతీయవ్యవహారాల మీద నెహ్రూకు ఉన్నంత పట్టు కానీ మరెవరికీ ఉండేవి కావు. కొత్తగా స్వతంత్రమవుతున్న దేశానికి  ప్రపంచదేశాల గుర్తింపు, సహకారం లభించడానికి నెహ్రూకు గల ఈ రెండు అర్హతలు తోడ్పడతాయని భావించడం వల్లనే ఆయన ప్రధానమంత్రి కావాలని గాంధీ కోరుకున్నట్టు చెబుతారు. విశేషమేమిటంటే,  అంతర్జాతీయవ్యవహారాలలో పీవీ పరిజ్ఞానం కూడా అంతటిదే. ఒక సందర్భంలో ఆయనను కలుసుకుని అంతర్జాతీయవ్యవహారాలను సుదీర్ఘంగా చర్చించే అవకాశం పొందిన ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా ఆ తర్వాత ఒక వ్యాసం రాస్తూ, భారతప్రధానమంత్రులలో నెహ్రూ తర్వాత అంతటి అంతర్జాతీయవిషయాల నిపుణుడు పీవీ నరసింహారావే నని అంటారు. అంతేకాదు, జాతీయనాయకులు అందరిలోనూ నెహ్రూ ప్రభావమే పీవీపై ఎక్కువ ఉన్నట్టు, ఇంచుమించు ఆయన ఆత్మకథగా చెప్పదగిన ‘ది ఇన్ సైడర్’ (తెలుగులో ‘లోపలి మనిషి’)ను చదివితే అర్థమవుతుంది. తన తండ్రి మరణం తర్వాత, నెహ్రూ మరణమే పీవీని ఎక్కువ చలింపజేసినట్టు కనిపిస్తుంది. ఆ ఇరువురి మరణఘట్టాలను ఎంతో విస్తృతంగా ఆయన చిత్రించారు. ‘లోపలి మనిషి’లోని కరుణరసార్ద్ర ఘట్టాలలో అవి ప్రముఖస్థానం వహిస్తాయి.

‘మాలోని మనిషివే, మా మనిషివే…’

పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కావడం, ఒక మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ అయిదేళ్లపాటు దేశానికి సుస్థిరపాలనను అందించడం తెలంగాణకే కాకుండా, రెండు తెలుగురాష్ట్రాలవారికీ గర్వకారణమే.  రాజకీయ, పరిపాలనా రంగాలలో ఉన్న ఇప్పటి నాయకులకు, రేపటి నాయకులకూ కూడా మార్గదర్శకం కాగల  నిండైన జీవితం ఆయనది.  ‘ది ఇన్ సైడర్’ అనువాదకునిగా వారిని అనేకసార్లు కలుసుకునే అవకాశం నాకు లభించింది.  మొదటిసారి కలిసినప్పుడు చెరబండరాజు రాసిన ఒక పాటలోని చరణం గుర్తుకొచ్చింది. ఆయన అప్పటికి మాజీ ప్రధాని అయ్యారు. దేశంలోనే అత్యున్నత పదవిని నిర్వహించిన ఒక వ్యక్తిని మొదటిసారి కలుసుకునే ముందు సహజంగానే ఎవరికైనా కాస్త జంకు కలుగుతుంది. అలాగే నాకూ కలిగింది. తీరా ఆయన సంభాషణ ప్రారంభించాక నాలో జంకు పోయింది. పలకరింపులు, పరిచయాలు అయిన తర్వాత నేరుగా ఆయన నాతో సాహిత్యం గురించి, అందులోనూ అనువాదవిధానాల గురించి ముచ్చటించడం ప్రారంభించారు. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలను తను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించడం గురించి చెప్పుకొచ్చారు. ప్రచురణకకర్తలు పుస్తకం మరీ పెద్దదిగా ఉందని, కుదించాలని అన్నారట. తను విశ్వనాథవారితో ఆ మాట అంటే ఆయన ససేమిరా, వల్లకాదు అన్నారట. అప్పుడు ఎలాగో ఒప్పించారట. ఆ విధంగా హిందీ అనువాదంలో మూలం 500 పేజీల మేరకు తగ్గింది. నేను పత్రికారచయితనే కాకుండా సాహిత్యనేపథ్యం ఉన్నవాడిని కనుక నేను వెంటనే ఆయనతో కనెక్టై సంభాషణలో స్వేచ్ఛగా పాలుపంచుకోవడం ప్రారంభించాను. చెరబండరాజు పాట చరణం గుర్తు రావడానికి అదే కారణం. “మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసువైనావు” అంటాడు ఆ పాటలో చెరబండరాజు. ఆ చరణాన్ని నేను సవరించుకుని పీవీగారికి అన్వయించుకుంటూ ఇలా అనుకున్నాను: “మాలోని మనిషివే, మా మనిషివే నీవు, (పొరపాటున?)పొలిటీషియనువైనావు”.

నేను చెరబండరాజు ప్రస్తావనతో మొదలుపెట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. నేను శ్రీశ్రీ, దిగంబరకవులు, విప్లవకవులు, అస్తిత్వవాదుల తరానికి చెందినవాణ్ణి. స్వాతంత్ర్యం కల్పించిన ఆశలు భ్రమలుగా తేలిపోవడం మా తరానికి కొంచెం ముందునుంచే మొదలైంది. పీవీగారు స్వాతంత్ర్యోద్యమతరానికి, స్వప్నాలకు, ఆదర్శాలకు చెందిన వ్యక్తి. కనుక మా మా మధ్య ‘మీటింగ్ పాయింట్’ ఏమైనా ఉంటుందా అన్నది మొదలే కలిగిన సందేహం. పీవీగారికి తనకంటే పెద్ద అయిన ఏ సాహిత్యవేత్తనో కలిసిన ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటే ఆయనకు ఏ విశ్వనాథసత్యనారాయణో గుర్తుకొచ్చేవారేమో! ఇది మా మధ్యనున్న తరం అంతరాన్ని తెలుపుతుంది. ఇలాంటి తేడాల మధ్య నేను ఆయన ‘ఇన్ సైడర్’ ను అనువదించాను. ఆ క్రమంలో ఆయనను అనేకసార్లు కలిసి, ఆయన ఆలోచనలను, ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను.

పీవీగారు (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలు నిర్వహించిన మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయసు రీత్యా, పరిణతి రీత్యా ఆయనను నిశితంగా చూసి అంచనా వేసే అవకాశం నాకు కలగలేదు. 1991లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే ఆ అవకాశం కలిగింది. ఆ సమయంలో దేశంలో ఏర్పడిన ఆర్థికసంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఆయా సంస్కరణల రూపంలో ఆయన తీసుకున్న మౌలిక, సాహసిక చర్యలు ఒక జర్నలిస్టుగా నన్ను సహజంగానే ఆకర్షించి, ఆయనపై ఆసక్తి కలిగించాయి. ప్రధానమంత్రిగా ఆయన అయిదేళ్ళ పాలననూ ఒక జర్నలిస్టుగానే పరిశీలించాను. ‘ది ఇన్ సైడర్’ నుంచి ఒక ఆంగ్లపత్రిక ప్రచురించిన కత్తిరింపులు చూసినప్పుడు కూడా, ‘ఇది తెలుగులోకి వస్తే బాగుంటుందే’ నని ఒక జర్నలిస్టుగానే అనుకున్నాను. నేను పనిచేస్తున్న ఆంధ్రప్రభ యాజమాన్యం ‘ది ఇన్ సైడర్’ తెలుగులోకి అనువదింపజేసి ధారావాహికగా ప్రచురించాలని నిర్ణయించినప్పుడు, సంపాదకులు వి. వాసుదేవదీక్షితులుగారు ఆ బాధ్యత నాకు అప్పగించినప్పుడు, ‘పాఠకులకు ఇది ఎంతవరకు నచ్చుతుంది, ఏ మేరకు సంచలనాలు రేపి పత్రిక సర్క్యులేషన్ కు తోడ్పడుతుం’దని- ఒక జర్నలిస్టుగానే ఆలోచించాను.

ప్రోటోకాల్ పక్కన పెట్టి…

అంటే, అనువాదంలోకి దిగే ముందు పుస్తకం మీద కానీ, పుస్తకంలోంచి తొంగిచూస్తున్న పీవీగారి గురించి కానీ ఇంతకు మించి గొప్ప ఊహలు, అంచనాలు ఏమీ లేవు. తీరా అనువాదం మొదలుపెట్టాక; ఓ రెండు అధ్యాయాలు ఆయన చూసి సరే అని, నాతో నేరుగా ఉత్తరప్రత్యుత్తరాలు, సంభాషణ ప్రారంభించాక —పుస్తకాన్నే కాక, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా కాస్త లోతుగా చూసే వెసులుబాటు కలుగుతూ వచ్చింది. తెల్లని పంచె, లాల్చీ, కండువాలతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ వామనమూర్తిలోని ఆలోచనల ఆజానుబాహువును పోల్చుకోవడమూ  ప్రారంభించాను.

రాష్ట్రమంత్రి నుంచి దేశప్రధానమంత్రివరకు ఎదిగి సుదీర్ఘ రాజకీయ, పదవీజీవితాన్ని చూసిన ఈ పెద్దమనిషికి, అలాంటివారిలో సహజంగా ఉండే ప్రొటోకాల్ పట్టింపులేవీ లేవు. అట్టడుగు స్థాయిలో పనిచేసే వ్యక్తితో నేరుగా సంబంధం, సంభాషణ పెట్టుకోగలరు! ఇదీ ఆయన వ్యక్తిత్వం గురించి నా తొలి ఎరుక.

అనువాదంలో తనదైన పంథా 

అప్పటికి నాకు ఉన్నదల్లా వార్తలను, వ్యాసాలను అనువదించిన అనుభవం మాత్రమే. అయినా అనువాదపు మెళకువలు, పద్ధతులు నాకు బాగానే తెలుసుననుకునేవాడిని. తీరా అనువాదం గురించి పీవీగారు అన్న మాటలు నా ఊహల్ని తలాకిందులు చేశాయి. వేరే భాషనుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు అందులో తెలుగుదనం ఉండాలనీ, వీలైనంతవరకు తెలుగు సామెతలను, నుడికారాన్ని వాడాలని అనుకుంటాం కానీ, అది సరి కాదని పీవీగారు అన్నారు. వేరే భాషలోని వాక్యనిర్మాణశైలిని, నుడికారాన్ని, సామెతలను వీలైనంతవరకు తెలుగులోకి యథాతథంగా తీసుకురావాలన్నారు. అప్పుడే తెలుగులో పదసంపద, వ్యక్తీకరణశక్తి పెరుగుతాయని ఆయన వివరణ. తెలుగుదనం తేవడం ముఖ్యమనుకుంటున్న నాకు ఆయన అభిప్రాయం వింతగా అనిపించినా, ఆయన చెప్పిన కారణం మాత్రం ఆలోచింపజేసింది.

ఆ తర్వాత రాష్ట్రమంత్రిగా, బహుభాషలు తెలిసినవారుగా, సాహితీవేత్తగా నాకు అంతగా తెలియని ఆయన జీవనానుభవాలలోకి కాస్త లోతుగా తొంగి చూసినప్పుడు; అనువాదం గురించే కాక, భాషగురించి కూడా ఆయనకు నాకంటే కూడా ఎక్కువ అనుభవం, అవగాహన, క్రియాశీలత ఉన్నట్టు బోధపడింది. పాత్రికేయమిత్రులు టి. ఉడయవర్లుగారు రాసిన ఒక వ్యాసం నుంచి ఉటంకించుకుంటే, ఒక భాషనుంచి మరొక భాషలోకి అనువాదం చేయడంవల్ల ఆయా భాషాజనాలకు చెందిన సంస్కృతులు కూడా ఇతర భాషాజనాలకు తెలుస్తాయనీ, దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చునని పీవీ భావించేవారు. ఇది శైలి, శిల్పం, నుడికారం, సామెతల యథాతథానువాదం వల్ల కలిగే ప్రయోజనానికి అదనం. దేశకాల పరిస్థితుల రీత్యా అది ఈనాటి అవసరమనీ, ప్రపంచభాషల్లోని మహా కావ్యాలు అన్నింటినీ రష్యన్ భాషలోకి అనువదించడానికి దోహదం చేసిన పీపుల్స్ పబ్లిషింగ్ హోమ్ పద్ధతి మనకీ అవసరమని, తెలుగు విశ్వవిద్యాలయం లాంటి సంస్థలు పాఠకులు ఉన్నారా లేదా అన్నది పట్టించుకోకుండా గ్రంథాలు ప్రచురించి సంస్కృతిని పరిరక్షించాలని పీవీ అనేవారు.

పరిపాలనాభాషా రూపశిల్పి

ఆయనకు రాజకీయ, పరిపాలనాజీవితం ఎంత ఉందో; దాదాపు అంతగానూ భాషగురించిన ఆలోచన, ఆచరణ జీవితం ఉన్నాయి. దక్షిణభారతహిందీప్రచారసభలోనే కాక, జాతీయస్థాయిహిందీప్రచారసంస్థలలో కీలకపదవులు నిర్వహించిన వేమూరి ఆంజనేయశర్మగారు పీవీగారి గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు. దక్షిణభారతహిందీ ప్రచారసభకు ఇందిరాగాంధీ అధ్యక్షులుగా ఉండేవారు. సభ కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడంతో ఇందిరాగాంధీ  పీవీని ఉపాధ్యక్షుడిగా నియమించారు. వేమూరి ఆంజనేయశర్మగారు ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. పీవీ సారథ్యంలో హిందీప్రచారసభ కార్యకలాపాలు గాడిన పడడమే కాదు, కొత్తపుంతలు తొక్కాయి. కేవలం హిందీని మాత్రమే కాక, ఇతర భారతీయభాషలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీవీ కొన్ని మౌలిక ఆలోచనలను అమలు చేశారు. ఉదాహరణకు, హిందీ ఎం. ఎ సిలబస్ అప్పటికి సాహిత్యప్రధానంగా ఉండేది. పీవీ దానిని భాషాప్రధానంగా కూడా రూపొందింపజేశారు. సాహిత్యకారులకు లేని ఒక అదనపు చూపు, ఒక అదనపు బాధ్యత పరిపాలనావేత్తగా పీవీగారికి ఉండడం ఇందుకు కారణం. భారతీయభాషల్లో పరిపాలన జరగడానికి వీలుగా ఆయన ఈ ఆలోచన చేశారు. విచిత్రమేమిటంటే, ఈ మార్పును అమలు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిష(యూజీసీ)నే కాదు,  భారతప్రభుత్వం కూడా మొదట్లో వెనుకాడిందట. పాఠ్యక్రమానికి రూపకల్పన జరిగిన తర్వాత కూడా విశ్వవిద్యాలయాలు తటపటాయిస్తే, పీవీగారే ద. భా. హిం. ప్ర. సకు చెందిన హైదరాబాద్ పీజీ సెంటర్ లో ఆ పాఠ్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఆ తర్వాత ఇది దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలకూ విస్తరించింది. హిందీ సహా భారతీయభాషలను కంప్యూటర్ కు అనుగుణంగా రూపొందించడంలో కూడా పీవీగారిదే ప్రాముఖపాత్ర అని ఆంజనేయశర్మగారు అంటారు.

తెలుగును బోధనాభాషగా, పరిపాలనాభాషగా మలచడంలో పీవీగారు ఇంతకన్నా పెద్ద ప్రయత్నం, పెద్ద యుద్ధం చేశారు. ఆ కృషిని బూదరాజు రాధాకృష్ణగారు వివరిస్తూ, తను ఎంతోమంది విద్యామంత్రులను ఎరుగుదుననీ, విద్యాశాఖ కార్యదర్శులను, డైరక్టర్లను, విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులను చాలామందిని చూశానని, పీవీగారికి ఉన్నంత భాషాభిమానం ఇంకెవరిలోనూ చూడలేదని అంటారు. చేతనైన పద్ధతిలో మాతృభాషలో సృజనాత్మక రచనలు చేయడమే భాషాసేవ అని మనలో చాలామంది అనుకుంటారనీ; శాస్త్రగ్రంథ రచన చేసినా, శాస్త్రీయవిషయాలను ప్రస్తావించినా అది భాషాసేవ కిందికి వస్తుందా అని సందేహిస్తారనీ, ఇలాంటి  వాతావరణాన్ని గుర్తుంచుకున్నప్పుడు పాములపర్తివారు తెలుగుభాషకు చేసిన సేవ ఎన్ని అవరోధాల మధ్య, ఎంతటి విరుద్ధవాతావరణంలో ఎంత సమర్థంగా సాగిందో నిగ్గుతేలుతుందనీ ఆయన వ్యాఖ్య.  ఆయన ప్రకారం, పీవీగారి భాషాసేవలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికి వారు వ్యక్తిగత వికాసానికే ప్రాధాన్యం ఇచ్చే భాషారంగంలో, బృందంలో ఒకడిగా పనిచేసే లక్షణాన్ని అలవాటు చేయడం.

తెలుగును అధికారభాష చేయడంలో…

తెలుగులో విద్యాబోధన, పరిపాలనా నిర్వహణలకు సంబంధించి పీవీకి ముందున్న చరిత్రను బూదరాజువారు ఏకరవు పెడుతూ, పీవీ దోహదం ఎలాంటిదో ఎత్తి చూపుతారు. ఉదాహరణకు, 1926లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తును స్థాపిస్తూ చట్టం తెచ్చినప్పుడే విద్యాబోధన తెలుగులో జరగాలని నిర్దేశించుకున్నారు కానీ అమలు జరగలేదు. 1946-47లో బ్రిటిష్ వాళ్ళు తూర్పు గోదావరిజిల్లాలో ప్రభుత్వం వారి ఉత్తరప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలని ఉత్తరువు ఇచ్చినా అదీ అమలు జరగలేదు. 1950-52 మధ్య కాలంలో నిజాం నవాబు తన అధీనంలోని తూర్పు జిల్లాల్లో అదేవిధమైన ఉత్తరువు ఇచ్చినా అమలు కాలేదు. తెలుగు భాష క్రమంగా అధికారభాష కావాలనే కోరిక 1955లో కానీ తీర్మానరూపం ధరించలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు అధ్యక్షతన 1957లో పరిపాలనకు అవసరమైన పరిభాషను తెలుగులో రూపొందించాలనే సంకల్పం కలిగింది. పీవీ భాగస్వామ్యం అప్పటినుంచీ మొదలు. 1963లో 900 పేజీల పరిపాలనా న్యాయపదకోశం వెలుగు చూసింది. 1953-62 మధ్యకాలంలో తెలుగు టైపింగులో శిక్షణ, పరీక్షణ జరిగాయి. 1962లో తెలుగులో ఉత్తరువులు రాసే ముసాయిదా వెలువడింది. 1966 నాటికి గాని తెలుగును అధికారభాషగా గుర్తించే చట్టం రాలేదు. పీవీ న్యాయశాఖ మంత్రిగా ఉండగానే తెలుగు అనువాదవిభాగం ఏర్పడింది. అంతకుముందు భారతరాజ్యాంగాన్ని ‘భారత సంవిధానం’ పేరుతో పీవీయే తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీషులో ఉన్న చట్టాలను తెలుగులోకి అనువదించడానికి తగిన విధాననిర్దేశం చేస్తూ తెలుగులో శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే బాధ్యతను న్యాయశాఖమంత్రిగా 1968-69లో పీవీయే నిర్వహించారు. తనకన్నా ముందు చట్టాలను తెలుగులోకి అనువదించినవారు పడ్డపాట్లను పీవీగారు శ్వేతపత్రంలో ప్రస్తావించారు. అనువాద సాధ్యాసాధ్యాలను చర్చించారు. 19968లో విద్యామంత్రిగా ఇంటర్మీడియట్ స్థాయిలో, ఆ పై స్థాయిలో తెలుగును బోధనామాధ్యమంగా ప్రవేశపెట్టడానికి తెలుగు అకాడెమీని, ఇంటర్మీడియెట్ బోర్డును నెలకొల్పడమే కాక, వాటి రోజువారీ నిర్వహణ తీరును కూడా పర్యవేక్షించారు. తెలుగులో పరిపాలనానిర్వహణకు తోడ్పడడానికి అధికారభాషాసంఘాన్ని నియమించారు. 1971లో నేషనల్ బుక్ ట్రస్టుతో కలసి అనువాదవిధానాల మీద చర్చాగోష్ఠి నిర్వహించారు. ఇంత కృషిలోనూ భాషావేత్తలనుంచి పీవీకి తగినంత సహకారం లభించిందా అంటే, లేదంటారు రాధాకృష్ణ.  శ్వేతపత్రంలో పీవీ పేర్కొన్న భాషాసిద్ధాంతాలను తప్పన్నారే కానీ, తమకు న్యాయశాస్త్రం పరిచయం లేదన్న సంగతిని గుర్తించలేదు. న్యాయపరిపాలన దృష్టితో పీవీ చేసిన ప్రసంగాలను వారు అర్థం చేసుకున్నట్లులేదు. వారికి న్యాయనిర్వహణలో ఎదురయ్యే సమస్యలు తెలియవు. దాదాపు 21 శాస్త్రాల్లో పరిభాషను సేకరించి, కల్పించి పాఠ్యగ్రంథాల్లో ప్రయోగించాలని తెలుగు అకాడెమీ నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం రచయితల స్వాతంత్ర్యాన్ని హరిస్తుందనీ, ఎవరి పరిభాషను వారు వాడనివ్వాలని వాదించిన భాషావేత్తలు ఉన్నారు.

అధికారభాషపై శాసనసభకు పీవీ సమర్పించిన శ్వేతపత్రం లోతైన పరిశోధనను, పాండిత్యాన్ని పట్టి చూపుతుందని మరో ప్రముఖభాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి అంటారు. శాతవాహనుల కాలం నుంచీ శాసనాలలో తెలుగు వాడకాన్ని అది ప్రస్తావించింది. రకరకాల పన్నులను, భూసంబంధాలను సూచించే తెలుగు పదాలను శాసనాలనుంచి  పీవీ అందులో విస్తారంగా ఉటంకించారు. ఇంటర్మీడియట్ స్థాయినుంచీ పాఠ్యపుస్తకాల్లో ఆధునికమైన తెలుగు వాడాలా, లేక గ్రాంథికం వాడాలా అన్న వివాదం తలెత్తినప్పుడు ఆధునికమైన తెలుగునే వాడాలని చెబుతూ పీవీ ఆ వివాదాన్ని పరిష్కరించడమే కాక; కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాలనుంచి కూడా పదాలను తీసుకోవాలని, తద్వారా అన్ని ప్రాంతాల భాషకూ న్యాయం జరుగుతుందనీ సూచించారట. తెలంగాణ మాండలికంపట్ల చిన్నచూపు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన అంశాలలో ఒకటన్న సంగతి గుర్తు చేసుకుంటే పీవీగారి ముందుచూపు ఎలాంటిదో అర్థమవుతుంది.

ఆలోచనల సహస్రావధాని

పీవీ ఆలోచనల సహస్రావధాని. ఆయన ఏక కాలంలో అనేక విషయాల మీద అనేక ఆలోచనలు, అనేకమందితో చేయగలిగేవారు. వాటికి నెలల తరబడి కొనసాగే ఒక ‘సీరియల్’ స్వభావం ఉండేది. ఒకసారి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు అమలు చేస్తున్న ‘ఐడియా’ల గురించి, వాటిపై తన కున్న సందేహాల గురించి, వాటిని తొలగించుకోడానికి తను చేసిన ప్రయత్నాల  గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఒక్క విషయం మీదే నాతో ఆయన సంభాషణ, మధ్య మధ్య పదిహేను, ఇరవై రోజుల విరామంతో రెండు నెలలకు పైగా ‘సీరియల్’ గా సాగింది. ప్రతిసారీ, ఇంతకుముందు సంభాషణ ఎక్కడ ఆగిందో సరిగ్గా అక్కడినుంచి ఎత్తుకునేవారు. ఆయనలో సమగ్రదృష్టి కలిగిన ఆలోచనాశీలిని పట్టి చూపే ఇలాంటి ఉదాహరణలను ఎన్నైనా ఇవ్వవచ్చు. అమ్మనుడిని ఆదరించడం, తెలుగులోనే బోధన జరగడం, పరిపాలనలో తెలుగును అమలు చేయడం, ఇంగ్లీష్ మాటలు లేకుండా తెలుగులోనే మాట్లాడడం లాంటి విషయాలను మనలో చాలామంది ఉద్వేగస్థాయిలో నొక్కి చెబుతూ ఉంటారు. ఆచరణకోణం నుంచి కూడా వాటిని చూసి ఆలోచించేవారు తక్కువ. పీవీగారి ఆలోచనాశైలిలోని ప్రత్యేకత అదే. తెలుగును బోధనామాధ్యమంగానూ, అధికారభాషగానూ అమలు చేయడానికి అంత కృషీ చేసిన ఆయన, వాటిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల గురించీ ఆలోచించారు. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్నవారికి ఉద్యోగాలలో ఉన్నన్ని విస్తృత అవకాశాలు తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ఉంటాయా అన్న సందేహాన్నికూడా ఆయనే లేవనెత్తి దానికి పరిష్కారం కనుగొనాలంటారు. ఆవిధంగా బోధన(instruction), పరిపాలన(administration)లకు ఉద్యోగానియమకాలు(recruitment)ను కూడా ఆయన జోడించారు. ఆచరణ సమస్యలు ఉంటాయి కనుకనే, “భాషావిధానాన్ని ఏవో ఒకటి రెండు రాష్ట్రాలలో మాత్రమే అమలుచేయలేం. జాతీయవిధానం అవసరం. అఖిలభారతస్థాయిలో విధానాన్ని అమలుచేస్తే తప్ప మనం విజయం సాధించలేం” అంటారు ఒక ప్రసంగంలో. బోధన, పరిపాలన, ఉద్యోగానియామకాలే కాకుండా భాషకు సంబంధించి ఒక స్థాయి, లేదా అంతస్తు(స్టేటస్) అనేది కూడా ఒకటి ఉంటుందని, అది ఉన్నప్పుడు భాషకు తనంత తానే ఒక శక్తి వస్తుందని, తెలుగుకు ఇతర భాషలతో సమానమైన అలాంటి అంతస్తును కల్పించగలిగినప్పుడు భాషావిధానం అమలులో అది ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన అంటారు. ఇలా ఆలోచనాశీలితో పోటీ పడే ఆచరణశీలి కూడా కావడం పీవీ ప్రత్యేకతలలో ఒకటి. కోర్టులో డిక్రీ పొందిన తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయనీ, అలాగే విధాననిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు ఎలా అన్న అసలు సమస్య మొదలవుతుందనీ, మనలో చాలామంది దీనికి తలకిందులుగా భావిస్తారని ఆయన అంటారు. కేంద్రంలో మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి కావడానికి ముందే జాతీయవిద్యావిధానం రూపకల్పనలో కీలకపాత్ర పోషించినదీ, ఆ తర్వాత మానవవనరుల మంత్రిగా  నవోదయపాఠశాలల ఏర్పాటు రూపంలో నాణ్యమైన విద్యను అందుబాటులో తెచ్చినదీ ఆయనే. అంతకుముందు సర్వేల్ పాఠశాలల ఏర్పాటు ఆయన ఆలోచనే. నవోదయపాఠశాలల్లానే ఇవి కూడా పెద్దగా ఆర్థికస్తోమత లేని విద్యార్థులకు భవిష్యజీవితంలో ఉన్నతస్థాయిని అందుకోడానికి తోడ్పడే విద్యను అందించాయి.

బుద్ధిలో బృహస్పతి

కాసు బ్రహ్మానందరెడ్డి తన మంత్రివర్గసహచరుడైన పీవీని బృహస్పతి అని పిలిచేవారట. ‘లోపలి మనిషి’లో ముఖ్యమంత్రి చౌదరి, మంత్రి ఆనంద్ ను అలాగే పరిగణించేవాడు. ఆలోచనాశీలి అనే మాటకు ముందు ‘మౌలిక’ అనే విశేషణాన్ని జోడించుకుంటే తప్ప పీవీ గురించిన చిత్రణ పూర్తి కాదు. ఆయన ఏ మంత్రిత్వశాఖలో ఉన్నా మౌలిక ఆలోచనలు చేశారు, వాటిని అమలు చేశారు. ఏడు, పది తరగతులు మినహా, మిగతా తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణతను(డిటెన్షన్ పద్ధతిని)రద్దు చేసిన సాహసి పీవీగారే నంటారు నాటి ప్రముఖ పత్రికా సంపాదకులు కూచిమంచి సత్య సుబ్రహ్మణం. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్టేట్ మంత్రిగా తనకు జైళ్ల శాఖ అప్పగించినప్పుడు జైలు సంస్కరణలకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశారో స్వాతంత్ర్య సమరయోధుడు ఎం. ఎల్. నరసింహారావు రాస్తారు. విదేశాలలో జైళ్ల సంస్కరణ విధానాన్ని పీవీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇతర రాష్ట్రాలలోని జైళ్ల పరిస్థితిని, కేంద్రప్రభుత్వ విధానాన్ని బాగా పరిశీలించి రాష్టంలో జైళ్ల సంస్కరణ చర్యలకు పూనుకున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆ విషయమై ఒక సదస్సును నిర్వహించారు(ఎందులోనైనా కొత్త ఆలోచనల అమలకు సంకల్పించినప్పుడు సదస్సులు ఏర్పాటు చేసి, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించడం పీవీ మొదటినుంచి చివరివరకు అనుసరించిన ప్రజాస్వామికవిధానం). ఆ సదస్సులో వచ్చిన సూచనల ప్రకారం,  1965లో మొదటిసారి అనంతపురం వద్ద ఆరు బయలు జైలును ఏర్పాటు చేశారు. బాల నేరస్థులకు, మహిళా ఖైదీలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఆ తర్వాత వైద్యఆరోగ్య మంత్రిగా, విడివిడిగా ఉన్న ఆ రెండు శాఖలనూ విలీనం చేశారు. ప్రభుత్వవైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.

రాజకీయాలలో సోషల్ ఇంజనీరింగ్

రాజకీయరంగంలో పీవీ చేసిన మౌలిక ఆలోచనలు ఇంకో ముఖ్యమైన అధ్యాయం. అంతవరకు పెద్దగా రాజకీయప్రాతినిధ్యం లేని ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి కొత్త సమీకరణలను నిర్మించడం ‘సోషల్ ఇంజనీరింగ్’ పేరుతో ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. రాష్ట్రంలో 1972 ఎన్నికలలోనే ఇలాంటి ‘ఇంజనీరింగ్’ ను అమలు చేసిన కీర్తి పీవీకి దక్కుతుంది. ఆ ఎన్నికలలో ఆయన వెనుకబడిన తరగతులకు, మహిళలకు, మైనారిటీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటినుంచే ‘బలహీనవర్గాలు’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు పాత్రికేయకురువృద్ధులు తుర్లపాటి కుటుంబరావు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా, రాష్ట్రంలో అప్పటికి రాజకీయప్రాబల్యం విశేషంగా ఉన్న సామాజికవర్గాలకు అదనంగా మరో సామాజికవర్గాన్ని కూడా బరిలోకి దింపి తద్వారా రాజకీయసమతూకాన్ని తేవడానికి ఆలోచన చేయడం నాకు తెలుసు.

భూసంస్కరణలపై  పేటెంట్                                                     

భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో కొందరు సాంఘిక, మతసంస్కర్తలుగా ప్రసిద్ధులైనట్టుగా; రాజకీయ, పరిపాలనారంగంలో వారితో సమానమైన గుర్తింపును రేపటి తరాలు పీవీగారికి మరింతగా ఇవ్వవచ్చు. ఆయన రాజకీయ, పరిపాలనా జీవితంలో అతిముఖ్యసంస్కరణలుగా రెండు ప్రధానంగా పైకి తేలతాయి. ఒకటి, ముఖ్యమంత్రిగా ఆయన తలపెట్టిన భూసంస్కరణలు; రెండు, కేంద్రమంత్రిగా ఆర్థికసంస్కరణలు. నిజం చెప్పాలంటే, దేశం మొత్తం మీద భూసంస్కరణలపై పేటెంట్ పీవీగారిదే. భూపోరాటాలలో ఎంతో అనుభవం ఉన్న కమ్యూనిస్టులు కూడా భూసంస్కరణలపై పీవీగారి మార్గదర్శనం కోరుకున్నారంటే దానిపై ఆయన ఆరాట, అధ్యయనాల లోతు అర్థమవుతుంది. అప్పట్లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న అచ్యుత మీనన్ కూడా భూసంస్కరణలపై తన సూచనలు, సలహాలు కోరారని పీవీ స్వయంగా నాతో అన్నమాట.

మొదటే చెప్పినట్టు భిన్నతరానికి చెందిన నేను పీవీని సానుకూల దృష్టినుంచి అర్థం చేసుకునే దిశగా బలమైన అడుగులు వేసింది; భూమి గురించి, భూసంస్కరణల గురించి ‘ఇన్ సైడర్’ లో ఆయన రాసినది చదువుతున్నప్పుడే. అంతకన్నాముందు నన్ను ఆకర్షించిన ఘట్టం ఇంకొకటి ఉంది…అది, ‘లోపలి మనిషి’లో ఆనంద్ మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత, ‘అసలు అధికారం ఎందుకు, తన మీద దాని ప్రభావం ఎలా ఉంటుం’దని ప్రశ్నించుకుని ఆత్మవిమర్శ చేసుకోవడం. ఇవి చాలా అవసరమైన, మౌలికమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ముందుకు తెచ్చిన మరో రాజకీయనాయకుణ్ణి నేను అంతవరకు చూడలేదు.  శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, రకరకాల కోరికలతో, విజ్ఞాపనలతో తన దగ్గరికి వచ్చే ఆర్తుల మధ్య గడుపుతున్నకొద్దీ తనొక వ్యక్తినన్న భావననుంచి బయటపడి పూర్తిగా విభిన్నమైన జీవిగా పరివర్తన చెందినట్టు అతనికి(ఆనంద్ కి) అనిపిస్తుంది. తన వ్యక్తిగత అస్తిత్వానికి ఇప్పుడు ప్రాముఖ్యం లేదనీ, తన ఆనందవిషాదాలు, తన బంధుమిత్రులు, తన ఇష్టాయిష్టాలు – అన్నీ అంతకంటె ఎంతో విస్తృతమైన ఆవరణలో లయమైపోయాయనీ, అది  విశ్వజనీనమైన మానవాళి అస్తిత్వం మొత్తాన్ని తనలో పొదవుకున్న ఆవరణమనీ ఊహ చేస్తాడు. ఈ అతీతస్థితిలో ప్రజాస్వామ్యపు ఆధ్యాత్మికరూపాన్నిఅతడు దర్శిస్తాడు! శాసనసభ్యుడిగా తనొక లక్షమందికి ప్రాతినిధ్యం వహిస్తే, ఇప్పుడు మంత్రిగా కొన్ని కోట్లమంది ప్రజల శ్రేయస్సుకు బాధ్యత వహించవలసివస్తుందని, ప్రాతినిధ్యం నుంచి బాధ్యతకు పరివర్తన దానికదే పెద్ద మార్పని అనుకుంటాడు. “మంత్రికీ, మామూలు మనిషికీ మధ్య వ్యత్యాసమేమిటి? స్వార్థపరార్థాల క్రమాన్ని తలకిందులు చేయలేనప్పుడు మంత్రి చేతిలో అదనంగా అధికారమనేది ఎందుకుండాలి, అందుకు ఎలాంటి కారణమూ లే”దని ఆనంద్ నిర్ధారణకు వస్తాడు.

అధికారం గురించిన ఈ వివేచనే ‘లోపలి మనిషి’లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆనంద్ వ్యవహరణలో అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. తీవ్ర ఆక్షేపణలను, విమర్శలను, శత్రుత్వాలను, చివరికి పదవీభద్రతను ఎదురొడ్డి ఆనంద్ భూసంస్కరణల అమలుకు పూనుకునేలా చేసింది. అధికారం గురించి తర్కించుకున్నట్టే భూమి గురించి, భూసంస్కరణల గురించి ఆనంద్ సుదీర్ఘంగా తర్కించుకుంటాడు. సాహిత్యపరంగానూ లోతైన, గాఢమైన అభివ్యక్తిని  తెచ్చుకున్న ఘట్టాలలో అది కూడా ఒకటి.

అతని ఆలోచనలు ఇలా సాగుతాయి:

“భూమి అంటే అధికారం. గ్రామజీవనంలో అదే సర్వస్వం. గ్రామీణచైతన్యంలో భూమి సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తం, సర్వసాక్షి. భూమి ఎవరూ ఢీకొనలేని సర్వోన్నతశక్తి, ఎవరూ నిరాకరించలేని మహా సత్యం, ఎవరూ విచ్ఛిన్నం చేయలేని జటిల నిర్మాణం. శతాబ్దాలుగా ఇది మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే ఉన్న నిజం.

“భారతదేశంలో భూమికథ హింసతో రక్తపాతంతో, కన్నీటి మరకలతో నిండి అనంతంగా విస్తరించింది. ఆధికారికపత్రాలు, ముఖ్యంగా భూమి సమస్య గురించి నిపుణులు రాసిన గ్రంథాలు లోతుగా అధ్యయనం చేసి తెలుసుకున్న ఎన్నో కీలకాంశాలతో ఆనంద్ మెదడు కిక్కిరిసిపోయింది. వాటిలో ఒకటి, పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ పాలకుల ప్రోత్సాహంతో ఒక వ్యవస్థగా ఎదిగిన భూస్వామ్యం పుట్టుకకు సంబంధించినది….ఆ రోజుల్లో బందిపోటు, రాజు, భూస్వామి వీరందరూ ఒకే వ్యక్తి ధరించే మూడురూపాలుగా పరిణమించిన ఆశ్చర్యకర సన్నివేశం విశేషంగా చెప్పుకోదగినది….

“భూమి, తన మీద జీవించే ప్రతి ఒకరికీ సొంతం; చెట్టు తన మీద గూడు కట్టుకున్న ప్రతి పిట్టకీ సొంతం; అలాగే నీరు…అప్రయత్నంగా, అవ్యాజంగా కలిగే సృష్టికర్త చలవతో తనలోకి ఎగిరి దూకుతూ, ఈదుతూ, జారుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ స్వేచ్ఛగా సంచరించే ప్రతి చేపపిల్లకీ సొంతం. ప్రతిదీ ప్రతి ఒకరికీ చెందుతుంది. ‘చెందడం’ అన్నదే సర్వత్రా వ్యాపించిన స్వాభావికస్థితి. అక్కడ ఎటువంటి రికార్డులూ లేవు, రిజిస్ట్రేషన్లు లేవు, ఎవరికీ ప్రత్యేకమైన స్వామ్యం లేదు, ఎవరికీ వ్యక్తిగతమైన హక్కు లేదు. ఇటువంటి అద్భుతమైన సుందరమైన వ్యవస్థనుంచి నేటి వ్యవస్థకు చేరుకోవడంలో అభ్యుదయం అనదగినదేమీ లేదని ఆనంద్ విచారంగా అనుకున్నాడు…

భూమి గురించి ఇలా తలపోస్తున్నప్పుడే ఆనంద్ కు గతించిన తండ్రి గుర్తుకొస్తాడు. అతని ఆలోచనలు తండ్రి అవసానదశవైపు మళ్లుతాయి. ‘లోపలి మనిషి’లో ఎంతో ఆర్ద్రతతోపాటు గాంభీర్యాన్ని సంతరించుకున్న విశిష్టఘట్టాలలో ఇది ఒకటి. ఈ చిత్రణలో వెనుకటికాలపు దాంపత్యసరళిని, తండ్రీ-కొడుకుల బంధాన్ని పీవీ అద్భుతంగా చిత్రీకరిస్తారు:

“తన అనారోగ్యం విషమిస్తోందని బహుశా నాన్నకి తెలుసు. కానీ అప్పుడే లా పరీక్షకు కూర్చోబోతున్న తనకు పరీక్షకు వెళ్లలేని పరిస్థితి కలిగించకూడదనుకున్నాడు. పరీక్ష పూర్తి కాగానే ఇంటికి రమ్మని చిన్న ఉత్తరం రాసి ఊరుకున్నాడు. ఆఖరిపరీక్ష కూడా రాసి ఇంటికొచ్చి నాన్న పరిస్థితిని చూసిన మీదట కానీ ఆయన తన క్షేమం కోసం ఎంత ప్రమాదాన్ని స్వీకరించాడో అతనికి అర్థం కాలేదు. గంట గంటకీ పరిస్థితి క్షీణిస్తున్నా అదృష్టవశాత్తూ నాన్న స్పృహలోనే ఉన్నాడు. ‘నువ్వు వచ్చావు, చాలా సంతోషం’ అన్నాడు భావగర్భితంగా. ..

“నాన్న త్వరత్వరగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో కూడా ఆశ్చర్యం గొలిపేంత స్పష్టత ఉట్టిపడుతోంది. తనకు మిగిలిన ఆ కాస్త సమయంలోనే చెప్పదలచుకున్నవన్నీ చెప్పాలన్న తహతహతో కాబోలు, అన్న మాట మళ్ళీ అనకుండా చెప్పుకుంటూ వెడుతున్నాడు. ఆనంద్ ఒక్కసారిగా ఘొల్లుమనేసరికి నాన్న కోపంగా అతనివైపు చూసి కనుబొమలు ముడిచి, క్షీణస్వరంతో అన్నాడు…’చూడు నాయనా, మనకు లక్ష్మి ఏనాడూ లేదు, ఉన్నదల్లా ధైర్యలక్ష్మి మాత్రమే. ఆమెను దూరం చేసుకోకు, లేకపోతే బతకడానికి నీకు మరే ఆధారమూ ఉండదు…’

“ఓ వైపున నాన్న అమ్మను చూసి కంటతడి పెడుతూనే, పెద్దగా శోకాలు పెడుతున్న అమ్మపై అంతిమక్షణాలలో కూడా కేకలు వేయబోవడం ఆనంద్ కు జ్ఞాపకమొచ్చింది. భూదేవంత ఓరిమితో ఆయన సంతానాన్ని కని పెంచి, ఆయన కోపతాపాలను గుర్తెరిగి మసలుకుంటూ పల్లెత్తు మాట అనకుండా నలభై ఏళ్ళు కాపురం చేసిందామె. అందుకు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కాబోలు. ఆ కృతజ్ఞతను ఆయన మాటల్లో వ్యక్తం చేయాలనుకోలేదు. అనుభూతి చెందడమే కానీ మాటల్లో వాళ్ళు ఏనాడూ ఏదీ వ్యక్తం చేయరు. వాళ్ళ జీవనసరళి అలాంటిది. ఒకరి మీద ఒకరికి ఎంతో అపేక్ష. కానీ దానిని ఏనాడూ ప్రకటించి ఎరుగరు.

“చివరిసారిగా నాన్న రామనామస్మరణ ప్రారంభించారు, తన చుట్టూ ఉన్నవారిని కూడా రామనామం జపించమని సైగ చేశారు. ఆ పెదవుల మీద ధ్వనించే నామస్మరణ ఒక్కొక్క ఆవృత్తి గడిచిన కొద్దీ క్షీణించి…మరింత క్షీణించి…చివరికి ఆ పెదవులపై నిశ్శబ్దస్పందనగా పరిణమించింది. మెల్లగా…ఇంకా మెల్లగా…ఆ కదలిక కూడా ఆగిపోయింది… అయిపోయింది…అంతా అయిపోయింది…

కుంగదీసిన నెహ్రూ అస్తమయం

తరాల అంతరం ఉన్న పీవీగారితో ‘లోపలి మనిషి’ అనువాదకుడిగా ఏదో ఒక స్థాయిలో నేను ‘కనెక్ట్’ కావడం చాలా ముఖ్యం. లేకపోతే అనువాదం కేవలం అనువాదం కోసమే అన్నట్టు చాలా యాంత్రికంగా మారుతుంది. అదృష్టం కొద్దీ అలా ‘కనెక్టు’ అయ్యే అవకాశం పైన చెప్పుకున్న ఘట్టాల రూపంలో చాలా తొందరగానే వచ్చింది. ఉండి ఉండి తర్వాత కూడా వస్తూనే ఉంది. నెహ్రూ అస్తమయంపై ఆనంద్ తలపోత అలాంటి మరో ఘట్టం. ‘లోపలి మనిషి’లోని ఆనంద్ లో పీవీని దర్శించగలిగినప్పుడు, నెహ్రూ ప్రభావవర్షంలో ఆయన నిలువునా ఎలా తడిసిపోయారో ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఆయన మరణవార్త ఆయనలో కలిగించిన దుఃఖోద్వేగపు అభివ్యక్తి కూడా గొప్ప ప్రవాహగుణాన్ని తెచ్చుకుని వరద కడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆనంద్ ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఉన్నప్పుడు ఆ దుర్వార్త తెలుస్తుంది. అరచేతుల మధ్య తల ఉంచుకుని ఆనంద్ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తండ్రి మరణించినప్పుడు కూడా కలగనంత దుఃఖం ఇప్పుడతన్ని ముంచెత్తింది. జవాహర్లాల్ లోని ఆకర్షణీయపార్స్వాలు ఒకొటొకటిగా అతని కళ్ళముందు కదిలిపోసాగాయి. గుజరాత్ ప్రాంతంలోని హరిపురాలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు వెళ్లినప్పటి తన అనుభవాన్ని పీవీ (ఆనంద్ ముఖతా) చెప్పుకుంటూవచ్చారు. అంత జనసందోహాన్ని తను ఎప్పుడూ చూడలేదు. జనసమ్మర్దంలో చిక్కుకుని ముందుకూ వెళ్లలేకపోయాడు, వెనక్కీ రాలేకపోయాడు. ఊపిరాడక చనిపోతానేమేనని కూడా అనుకున్నాడు. ఆ తోపులాటలో తన ప్రయత్నం లేకుండానే సభాస్థలికి చేరుకున్నాడు. అంతవరకూ కలిగిన అసౌకర్యాన్ని మరచిపోయి అక్కడున్న ఇతర గ్రామీణులల్లానే జాతీయనాయకుల్ని ఒక్కొక్కరినే గుర్తుపట్టడంలో మునిగిపోయాడు… జవహర్లాల్, బోస్, పటేల్, ఆజాద్, పట్టాభిసీతారామయ్య, గఫార్ ఖాన్(అందరికంటే ఎత్తుగా)….ముంచెత్తిన భావావేశంతో ఒక్కొక్కసారి ఆగుతూ, ఒక్కొక్కసారి ఝరీవేగంతో ముందుకు దూకుతూ నిజాయితీ ఉట్టిపడే నెహ్రూ అభిభాషణను మొదటిసారి విన్నాడు. ఆ తర్వాత త్రిపురి ప్లీనరీకి వెళ్లినప్పుడు, పూణేలో ఒక విద్యార్థుల సమావేశానికి వెళ్లినప్పుడు నెహ్రూలోని శీఘ్రకోపాన్ని చూసిన సంగతిని ఎంతో మురిపెంగా ఆనంద్ గుర్తుచేసుకున్నాడు. త్రిపురిలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విమానం పెద్దశబ్దంతో చుట్టూ తిరుగుతూ, శ్రోతల ఏకాగ్రతకు భంగం కలిగించింది. జవహర్లాల్ ఆగ్రహంతో ఊగిపోతూ, ఈ సమీపంలోకి ఏ విమానం రావడానికి వీల్లేదని గట్టిగా కేకపెట్టారు. ఆయన ఆదేశాన్ని పాటించేది ఎవరా అనుకుంటూ ఆనంద్ ఆశ్చర్యపోతుంటే, నిజంగానే ఆ విమానం మళ్ళీ ఆ దరిదాపులకు రాలేదు. పూణే సమావేశంలో నెహ్రూ సభాస్థలికి రాగానే విద్యార్థులు పండిట్ జీ జిందాబాద్ అంటూ నినాదాలు ప్రారంభించేసరికి నెహ్రూవారిపై కోపంతో విరుచుకుపడ్డారు. యుద్ధంతో ధ్వంసమైన ఒక దేశాన్ని అప్పుడప్పుడే చూసివచ్చిన ఆయనలో ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి. బయటి ప్రపంచంలో ఏ జరుగుతోందో పట్టని బాధ్యతారాహిత్యం విద్యార్థుల ప్రవర్తనలో కనిపించడమే ఆయన కోపానికి కారణం.

మృతప్రాయమైన జాతీయోత్పత్తి అంకెల కంటె, జాతి గౌరవానికే ప్రాముఖ్యం ఇచ్చుకున్న ఆ సందర్భంలో నెహ్రూ అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ఠను ఇనుమడింపజేయడం గురించి ఆనంద్ తలపోశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతని భావనలో జవహర్లాల్ ఒక వినూత్నభావప్రపంచానికి రూపకల్పన చేసి అందించాడు! ఒక రంగంలో కాదు, ఆలోచనకీ, ఆచరణకీ సంబంధించిన అనేక రంగాలలో ఆయన దేశానికి మార్గదర్శనం చేశాడు! దేనిని తాకితే దానిని ఉజ్వలింపచేశాడు! అదే సమయంలో, నెహ్రూలేని భారతదేశం భవిష్యత్తు గురించి కలవరపడిన ఆనంద్,  గాంధీకి తను వారసుడైనట్టుగా తనకు తగిన వారసుని నెహ్రూ అందించకపోవడాన్ని తప్పు పట్టాడు.

భూసంస్కరణల అమలు నెహ్రూ ఆదేశమే. ఆనంద్ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను తలకెత్తుకున్నది కేవలం నెహ్రూ అనుయాయిగానూ, అభిమానిగానే కాదు; నక్సల్బరీ ఉద్యమం విసిరిన సవాలుకు జవాబుగా కూడా! ‘లోపలి మనిషి’లో నక్సల్ బరీ ఉద్యమం గురించిన పరిచయాన్నీ, దాని గురించి ముఖ్యమంత్రికి, ఆనంద్ కు మధ్య జరిగిన చర్చనూ పీవీగారు ఎంతో విపులంగా, నాటకీయంగా చిత్రించుకుంటూ వెడతారు. ముఖ్యమంత్రి భూసంస్కరణలను వెక్కిరిస్తే ఆనంద్ సమర్థిస్తాడు. నా ఉద్దేశంలో- నక్సల్ బరీ ఉద్యమమూ, దానిని ఎదుర్కోవడానికి మనం ఆచరణలో ఏమైనా చేయగలమా అని, ఆనంద్ ముఖతా పీవీ ప్రశ్నించుకోవడం, భూసంస్కరణల అమలుకు పూనుకోవడమే 752 పేజీల ‘లోపలి మనిషి’లో ప్రధాన ఇతివృత్తం. ఆవిధంగా స్వాతంత్రోద్యమ తరాన్ని దాటి పీవీ మా తరం దగ్గరికి వచ్చేశారు, అలా మా తరానికి ఆయనకూ మధ్య  ఒక ‘మీటింగ్ పాయింట్’ ఏర్పడింది.

ఇప్పుడు ఆయన  శతజయంతి వేళ, ఈ దేశానికి ఆయన ఏమిచ్చారని ప్రశ్నించుకున్నప్పుడు బహుశా నా ఉద్దేశంలో దానికి జవాబు ఇలా ఉంటుంది: అధికారం దేనికి అనే ప్రశ్నవేసుకుని ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరాన్ని ఆయన ప్రస్ఫుటంగా ముందుకు తెచ్చారు. లోతైన ఆలోచనతో, దార్శనికతతో ఆచరణను ఎలా మేళవించాలో చెప్పారు. రాజకీయ, పరిపాలనారంగాలను అవసరమైనప్పుడల్లా సంస్కరించుకోవలసిన ఆవశ్యకతను బోధించారు.

PHP Code Snippets Powered By : XYZScripts.com