మార్కండేయ పురాణం – మారన
చ. అనికడువంతగూరుచు హిమాద్రితటంబున సంచరించు వి
ప్రుని మకరాంకసన్నిభుని వరూధిని నాజను నొక్క యప్సరం
గన లలితాంగ కాంతిజిత కాంచన విభ్రమచంచదలలో
చన కలహంసయాన కని సంభ్రమసంచలితాంతరంగయై
ఉ. ఈ సుకుమారుడెవ్వరొకొ యిందులకెందుల నుండి వచ్చెనో
భాసుర రూపజిత భావజ చంద్రుడితండు రాగలీ
లాసరసత్వమెన్న కడు లాలసుడైనను జూచెనేని నే
జేసిన పుణ్యమెవ్వరును జేయరు కాముని దక్కనేలుదున్
గీ. ఈ కుమారునిమీద నాహృదయమిప్పు
డధికరాగరసోద్రిక్తమైనమాడ్కి
నితని మనమును నాయందు నతులరాగ
లలితమగునేని యది జన్మఫలముగాదె
సీ. భక్ష్యభోజ్య లేహ్యపానీయములు రత్న
మండపములు వస్త్రమాల్యములును
కర్పూరచందన కస్తూరికాదులు
నేనర్థియీగొని నింపుమిగుల
గాసుఖించుచులీలగంధర్వ కిన్నర
వేణు వీణాగీత వివిధ గతులు
వినుచు మందానిలంబనుభవించుచు నిమ్మ
హాకైలసానుపర్యంకతలము
గీ. నందు రమియింపు భవదీయ మందిరమున
కలుగునే యిట్టి దివ్యభోగంబులనుచు
రాగసాగర మగ్నయై రాజవదన
కదిసి భూసురవరు చక్క కౌగిలించె
ఉ.ఎక్కడినుండి వచ్చెనతడీతుహినాద్రికి వేడ్కనూని? యే
నక్కట! యక్కుమారు రుచిరాకృతియాదట నేలజూచితిన్?
మక్కువ యేలనాటె మది? మన్మథుడేల సహించు నన్ను? వా
డెక్కడ వచ్చునింక? నదియేల పొసంగు? దురాశయేటికిన్?
క్రీ.శ.189-1323. తెలుగులో తొలి పురాణానువాదం చేసినకవి మారన. ప్రతాపరుద్రుని సేనాని గన్నయమంత్రికి అంకితం చేశాడు. గోదావరీ తీర ప్రాంతం. మార్కండేయ పురాణంలో అనేక కథలున్నాయి. వాటిని ప్రబంధశైలికి మార్చి అనువదించాడు మారన. వరూధినీ ప్రవరాఖ్యుల కథ మార్కండేయ పురాణంలోనిది. ఆ కథానువాదంలోని ఒక సన్నివేశం. హరిశ్చంద్రుని కథ మొదలైనవి ఈ పురాణంలో ఉన్నాయి. వాటిని కావ్యాలుగా తీర్చిదిద్దాడు. తరువాత ఎందరో కవులకు మార్గదర్శకుడు మారన.