పాఠకుడు అధ్యయన శీలి కావాలి
తెలంగాణ సాహిత్యం లో ఇప్పుడొక సరళత కనిపిస్తుంది .ఎదో నింపాదితనం ఆవహిస్తోంది . కవితా పారిశ్రామికుల్లో ఒక ఆర్తి వ్యక్తీకరణ లో లోతు కోసం. గాఢత కోసం ఒక తపన కనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమ సమయం లో కార్య శూరులైన చాలా మంది కలం వీరులు గా కూడా మారారు .కవితా ఖడ్గం ఝుళిపించి నూతన రాష్ట్ర సాధన కోసం నడుం కట్టారు .ఈ ప్రయత్నం లో కొంత అకవిత్వం అనివార్యం గా వచ్చింది .ఒక్క కవిత్వానికే కాక ఇది ఇతర ప్రక్రియలకు కూడా వ్యాపించింది .
ఇది ఒకానొక సామాజిక పరిణామమే కాని లోపం కాదు .ఇపుడు మనకు నాటి ఆవేశం అవసరం లేదు .మనం ఒక నిర్మాణం లో ఉన్నాం .సాహిత్యం కూడా దీన్ని ప్రతిఫలించాలి .
ఈ నాటి సాహితీవేత్త ఈ దిశలో అడుగు వేస్తున్నాడు .వివిధ రకాలైన పూలమొక్కలతోటే తోట పరిమళించినట్టు ,విభిన్న వాదాలతో సాహిత్యం పరిమళిస్తుంది .మన నిర్మాణానికి అవసరమైన మేరకు ప్రతి చైతన్యాన్ని మనం స్వీకరించి ఒక సమన్వయం తో సాగుతుంటాం .
కాగా రచన ఒక సృజన కారునికే పరిమితం కాదు . పాఠకుడే దాని మూలదాతువు . పాఠకుడు సంపద్వంతుడు కాక పోతే రచన ఎంత గాఢమైనదైనా ప్రయోజనం ఉండదు .
ఈనాటి మీడియా వ్యాప్తి వల్ల వాటిలో వస్తున్న వ్యాపార పరమైన సీరియల్స్ వల్ల, సాహిత్యం దెబ్బతిన్నదనే అపవాదు ఒకటి ఉన్నది .కాని ఇది నిజం కాదు . నాటి వ్యాపార నవలల పాఠకులు మాత్రమె ఈ సీరియల్స్ వీక్షకులు అవుతున్నారు .దీనివల్ల వ్యాపార సాహిత్య ప్రచురణ లు మాత్రమే దెబ్బ తిన్నాయి .సీరియస్ సాహిత్య పాఠకులు కొనసాగుతూనే ఉన్నారు .ప్రచురణలు వస్తూనే ఉన్నాయి .
ఇట్లాగా ప్రచురణలు , సాహిత్య పత్రికలు నడవడమంటే దానికి పాఠకుల ఉత్తమాభిరుచే కారణం .కాగా ఇక్కడ కూడా ఒక అలవోక పఠనం ఉన్నది .దానిస్థితి నుంచే మరింత ఎదగవలసి ఉన్నది .
పాఠకుడు అధ్యయన శీలిగా ఎదగాలి .సృజన కారుని లోతులు గుర్తించాలి .అతనితో మమేకం కాగలగాలి .సౌందర్య మీమాంస లో చెప్పిన అనేక పాత కొత్త సిద్దాంతాల సమన్వయం ఇదే .
ఇట్లా సాహిత్యం లో సమగ్రత తేవడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం .
జై తెలంగాణ, జై జాగృతి .