సమకాలీన సమస్యలకు వెంటనే స్పందించే లక్షణం కవి వనపట్ల సుబ్బయ్య ది. ఇవ్వాళ్ళ కవిత్వం రాసి లో ఒక చేయి తిరిగిన కవి ఆయన .కటికనేని సౌభాగ్య లక్ష్మి గారిచేయి అక్షయ పాత్ర అని అభివర్ణించడం ,కరోనా మహమ్మారివల్ల తుది శ్వాస విడిచిన ప్రజా గాయకుడు నిస్సార్ గురించి ,ఉద్యమ జీవి ఉ.సా.గురించి గోవింద్ గురించి వలపోత ,వనపట్ల స్పందనను ,ఆర్తి ని తెలియజేసే వ్యక్తీకరణలు. .
కరోనా మానవ జీవితాన్ని అతలాకుతలం చేసింది .మనిషి నిర్మించుకున్న రక్షణ వ్యవస్థ ఎంత నిస్సహాయమో తెలియజేసింది .ప్రకృతి ముందు మనిషి బలహీనుడే అని మరోసారి హెచ్చరించింది . ఈ కరోనా కల్లోల వాతావరణం లో వనపట్ల కలం చెమరింత ఆశర్యం అసలే కాదు .
ఈ సందర్భం లో కావలసింది మనుషులు మానవత్వాన్ని నింపుకొని ఉండడం .ఈ విపత్తు దాటడానికి అదే ప్రధానాయుధం .
“చెట్టు పిట్టకింత గూడు ఇచ్చినట్టు, హృదయాలలో పిడికెడంత చోటివ్వాలి, ఈగల్లా ఇసిరేయకుండా గడ్డకట్టిన సేవాతత్వాన్ని వెన్న రవ్వలా కరిగించాలి”అంటూ ఆపదలో మనిషి ప్రవర్తించాల్సిన విధానాన్ని ప్రకటిస్తాడు .
కవి సెల్ఫ్ లాక్ డౌన్ విదించుకున్నాడు.ఇంట్లో ఉండడడం వల్ల ఇల్లంటే ఏమిటో తెలిసి వచ్చింది . ఇంట్లో తన కర్తవ్యం స్పురించింది .ఆ ఎరుకతో రాసిన కవిత బోదివృక్షం.
వనపట్ల అభివ్యక్తి శక్తి ఈ పోయెమ్ లో పూర్తి స్థాయి లో కనిపిస్తుంది .
“నేనిపుడు ఏ నిమిషం ఖాళీ గా లేను .సూర్యుడు పోద్దేక్కకముందే
అక్షర పావురాలు మోసుకొచ్చిన పత్రికల సమాచారం చదివి
విశ్వ దుఖానికి సంతాపంగా అమరులకు రెండు
మౌనం పాటిస్తున్న అంటూ లాక్ డౌన్ సమయాన్ని వినియోగించుకొనే కవి సమయాన్ని చెబుతాడు .నేను ఇపుడు ఏ నిమిషం ఖాళీ గా లేను అనే మాట పునరావృతం కావడం వల్ల పోయెమ్ తూగు సరిగ్గా సరి పోయి చెప్పవలసిన భావం మరింత సారస్యం గా పలికింది .
సుబ్బయ్య కవిత్వం ఆసాంతం పరిశీలిస్తే ఈయన ప్రత్యేకించి ఒక వాదాన్ని ఆశ్రయించి రాసే కవిగాదని తెలిసి పోతుంది .అన్ని రకాల సామాజిక పర్య వసనాలకు స్పందించటం ఆయన ప్రధాన లక్షణం. బహుజన దృక్కోణం ఆయన కవిత్వం లో పూసల లో దారం గా ఒదిగి కనిపిస్తుంది .ఈ వరుసలో చేరదగిన సపాయిలకు సలాం కవిత చూడండి,
‘’ఊరు ఊరంతా వాళ్ళు
మౌన మునుల్లా తిరుగుతరు
ఆస్పత్రులు ,వీధులు ,రోడ్లు ,ఇండ్లు
చెత్త, కనబడితే వాళ్ళ గుండెలు కమిలి పోతయి , సందుల్ల మూలల్లో దాగిన మురికంతా ఊడ్చి వీధులను పున్నమి చంద్రున్ని చేస్తరు. ఇట్లాంటి సపాయిలే ఇప్పుడు మన ప్రాణ రక్షకులు . డాక్టర్లు పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా విలువైన సేవలను అందించారు .ఏ మహమ్మారి పడగ విప్పినా వీళ్ళే మన రక్షకులు .
తరతరాలు గా ప్లేగు ,మశూచి కలరా ,కరోనా గత్తర్లెన్నోచ్చినా వాళ్లేప్పుడు యుద్ద సైనికులే, ఇట్లా అతి నిసర్గం గా సామాజిక స్రవంతి లో సపాయి ప్రాధాన్యత గురించి చెబుతాడు .
అంతా స్వీయ నియంత్రణ లోనే ఉంది . అంతర్జాతీయం ,జాతీయం ప్రాంతీయం ,ఎక్కడైనా భౌతిక దూరం నినాదమే వ్యాపించింది .మనిషే ఒక వైరస్ లా కనిపిసున్నాడు .మృత్యువు ఎదురొస్తున్నట్టు …అంతా ,,భయం …భయం
ఇయ్యాల తుమ్ములు దగ్గులు మానవాళిని మట్టుబెట్టే శతఘ్నులు
అపరిశుభ్రత అంటుకోవడం.దేశ దేశాల్ని బూడిది
చేస్తున్న అణుబాంబులు ప్రకృతిని కాలదన్నితే
వికృతి కానుకనే ఈ కరోనా
అంటూ పాడు కాలాన్ని గురించి ఆవేదన పడుతాడు . సాయం చేసిన చేతులకు సలాం చేస్తూ , చేట్టు ను చూసి నేర్చుకో అని సందేశం ఇస్తాడు .’’నిలబడాలి నిట్టాడులా ,బతికి చూయించాలి, బండ మీద రాయి మొలకలా ,అంటూ ప్రభోత్మక వాక్యాలతో ముగిస్తాడు .
వనపట్ల లోని విస్తృతం గా చెప్పాలనే ఆత్రమో ,లేక స సమయం గా పూర్తి చేయాలనే ఆరాటమో కాని అప్పుడప్పుడూ వచనం , పోయెమ్ ని కప్పెస్తుంటుంది .కవిత్వం భావ సూచన అనే ప్రాధమిక లక్షణం ఆయన తొందర వల్ల భావ ప్రకటన గా మారిపోతుంటుంది .సుబ్బయ్య లాంటి విస్తృతం గా రాసే కవికి వీటిని అధిగమించడం చాలా సులువైన విషయం.