1952 లో వచ్చిన ఈ కాథ నాటి తెలంగాణ అథో వర్గాల దైన్యానికి ఒక ప్రతిఫలనం…

సాయంత్రము 7 గంటల సమయము ఖైదీలను గదుల్లో పెట్టి తాళము వేసి వరండాలో జవానులు మాటా, మంతీ సాగించారు. తాము ఉద్యోగము చేసిన వివిధ జేళ్ళలో చేసిన దౌర్జన్యాలను ఘనకార్యాలుగా, ఖైదీలు చేసే సాహసచర్యలు, వాని నణచుటకై అవలంబించే వివిధ పద్దతులను తమ అమూల్య అనుభవాలుగా చెప్పుకుంటున్నారు జవానులు.

ఖైదీల గది నుండి ఒక ఖైదీ ఏడ్పు వినబడింది. ఎంత సేపటి నుండో ఉప్పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నప్పటికి, హద్దు దాటి విధిలేక పెద్దగా ఏడ్వాల్సి వచ్చింది. అయినప్పటికి “ఇది జైలు, ఏడ్వటానికి కూడా స్వాతంత్ర్యము లేదు; ఎదురుగా వరండాలోనున్న జవానులు ఏమంటారో” అనే భయము కూడా ఆ ఏడ్పులో ధ్వనిస్తున్నది.

ఆ గదిలో తమ తమ స్థలాల్లో కూర్చొని, తమ బయటి ప్రపంచాన్ని తలచుకుంటున్న యితర ఖైదీలు ఏడుస్తున్న ఖైదీ – మల్లయ్య వైపు సానుభూతితో, ఆశ్చర్యముతో దృష్టి మరల్చారు.

జవానులు “ఏమిటోయ్! అల్లరి” అని తమ కర్తవ్యాన్ని లాంఛనంగా అమల్లో పెట్టి, ఆ ఖైదీ దుఃఖాన్ని సామాన్య విషయంగా, అట్టివెన్నో తమ అనుభవానికి వచ్చినట్లు నిర్లక్ష్యంగా, తిరిగి మాటా మంతీ సాగించారు. “ఈ ఖైదీలు కూర్చొని మాట్లాడటానికి కూడా అవకాశమివ్వరు” అని ఒక జవాను విసిగాడు.

ఖైదీలు వారే కుటుంబానికి, మతానికి,కులానికి, గ్రామానికి సంబంధించిన వారైనా వారంతా ఖైదీలు. నేటి ఒకే విష సమాజ వృక్షానికి కాసిన కుక్కమూతి పిందెలు.

మల్లయ్య ఖైదీ వద్ద ఇతర ఖైదీలు మూగారు. మల్లయ్య ఏడ్పు కొద్దిగా తగ్గింది. కాని చుట్టు ఖైదీలంతా ఆప్తులుగా చేరేవరకు తిరిగి దుఃఖము పొంగి వచ్చింది. ఎక్కి ఎక్కి ఏడ్వసాగాడు.

“ ఏమి జ్ఞాపకమొచ్చిందో ” ఒక ఖైదీ సానుభూతిగా అన్నాడు.

“జేలుకు వచ్చి ఏడిస్తే ఏమి లాభం? మొదటనే హుషారుగా ఉండాలే.” ఒకడు ధర్మపన్నాలు పలికాడు.

మూడు నెలలకే ఇంత బుగులు పడతారోయ్! నా సగం వయసు జైల్లో గడిచింది. ఇంకా జైల్లోనే ఉన్నాను నేను. ఇంకా ఎన్నిసార్లు రావలసి ఉందో” ఒక జేలు పిట్ట పలికింది.

“ఎందుకేడుస్తున్నావు మల్లన్నా” చాలా దీనంగా ఒక ఖైదీ పరామర్శ చేశాడు.

తన తండ్రి మంచములో పడి మూల్గుతుండగా ఎక్కిఎక్కి ఏడుస్తున్న తనను తన తండ్రి పరామర్శ చేసిన దృశ్యం మల్లయ్య కండ్లల్లో ఆడింది.

మలయ్య ఖానాపురం వంతుమాదిగ. తల్లి చిన్నప్పుడే ప్రసూతి రోగంతో మరణించింది. పొట్టకు చాలని కష్టంతో జీవితమెల్ల కండలు కరిగించి చావుకు కాళ్ళు చాపి మంచములోపడి ఉన్న ముసలితండ్రి. తల్లి చస్తూ వదలిపోయిన ఆడ పసికూనను ప్రేమతో పెంచి పెద్ద చేసిన చెల్లెలు – యిదే అతని కుటుంబము. తండ్రి ముసలివాడైనందున గ్రామ బేగారి పని మల్లయ్య మెడబడ్డది. తండ్రి మంచము పట్టాడు. పది. పన్నెండేండ్ల చెల్లెలు పెండ్లి భారం. మంచం పట్టిన తండ్రి చికిత్స – ముఖ్యంగా కుటుంబ పోషణ భారం మల్లయ్యపై బడ్డది. బేగారి చేసిన తర్వాత దొరికే కొద్ది సమయములో ఇతర కూలిపని చేసుకోవడం కూడా ఒక్కొక్కప్పుడు సాధ్యం కాకపోయేది. మల్లయ్య ఒక్కొక్కప్పుడు ప్రభుత్వాధికారుల బరువులకు పోవడం చెల్లెలు గ్రామ బేగారి పని చేస్తే, తండ్రిని చూసుకోవడం జరుగుతుండేది. ఒక్కొక్కసారి బేగారి చేసిన తర్వాత వేరే కూలి లేక దినమంతా పొట్ట మాడ్చుకునే ఉండాల్సి వచ్చేది. తంటాలుపడి తండ్రికి మాత్రం పేరుకు నోరు తడిపేవాడు. . మలయ్య ఒకనాడు బరువుకు పోయి సాయంత్రము ఇంటికి చేరుకున్నాడు . తండ్రి ఆరోగ్యము మరీ చెడిపోయింది. ప్రమాదస్థితిలో నున్నాడు. చెల్లెలు ఏడుస్తూ కూర్చున్నది. ఒక వైపు కడుపు మాడ్తున్నది. రెండోవైపు తండ్రి దూరమయేస్థితి వచ్చింది. వస్తున్న దుఃఖాన్ని మల్లయ్య ఆపుకొని చెల్లెలును సముదాయించి, ఆ రాత్రికై ఏ విధంగానైనా ఇంత ఆదరవు సంపాదించడానికి ఇల్లు వదలి బయలుదేరాడు.

ఆలోచిస్తూ మల్లయ్య గ్రామం వెలుపలికి పోయాడు. పోలాల్లో కుప్పలు పేరుస్తున్నారు. మెల్లగా ఒక కళ్ళం వద్దకి చేరాడు.

ఆ రోజంతా పొలాలలో పనిచేసిన కూలీలు తమ కూలి తక్కువ దొరికినందుకు భూస్వామితో బేరాలు చేస్తున్నారు. భూస్వామి లోభత్వానికి విసిగి, బిచ్చము గింజలకై ప్రాధేయపడున్నారు. భూస్వామి ఎంగిలి మెతుకులు దులిపినట్లు ఇన్ని గింజలు కూలి వాండ్ల ఒళ్ళో చల్లాడు. ఆ దృశ్యమంతా చూస్తున్న మల్లయ్య నిరాశ చెందాడు. కష్టపడినవాండ్లకే కూలి సరిగా యివ్వక బిచ్చము గింజలు కూడా ఏడుస్తూ పెడ్తున్నప్పుడు తన కొక గింజకూడా ఆశలేదని నిరాశతో కొయ్యకాలు పొలాలవైపు వెళ్ళాడు.

పనులు ముగించుకొని భూస్వాములు, జీతగాండ్లు కూలీలు గ్రామం ముఖం పట్టారు.

ముసి, ముసి చీకట్లో ఒక్కొక్క పరిగెకర్రను పోగుచేసుకొని కట్టగా కట్టి ఆనాటి రాత్రికి ఆదారము దొరికనందున తన ప్రయోజకత్వానికి గర్విస్తూ వీరునిగా ఉత్సాహంగా ఇంటిదోవ పట్టాడు. తండ్రిని తలచుకొని, ఏర్పడిన ఆపద జ్ఞాపకము రాగానే ఉత్సాహానికి, గర్వానికి చెంప పెట్టయి కుంగిపోయాడు.

మార్గ మధ్యమున అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలుగా పేర్చి ఉన్న వరికుప్పలను, తన చంకలోని పరిగెకట్టను పోల్చుకున్నాడు. ఈర్ష్య పడ్డాడు.

“అవి ఎంత పెద్దగా నున్నప్పటికి ఈ కట్టకిందికి రావు. పనికిరావు. కుప్పలు కుక్క గొడుగులు అనుకుంటు ముందుకు సాగాడు.

“ఎవరోయ్, అటుపోయేది” ఒక కుప్ప వద్ద నుండి ధ్వని వచ్చింది.

మల్లయ్య నిలబడ్డాడు. నలువైపుల పరికించాడు.

ఒక ఆజానుబాహుడు మెడ మీద అడ్డంగా చేతికర్రను ఆనించుకొని కర్ర రెండు చివరలు పట్టుకొని మల్లయ్యవైపు వస్తున్నాడు.

“ఎవడ్రా నీవు? ఎక్కడ నుంచి తెస్తున్నావు ఆ కట్టను?”

“పొలాల్లో పరిగెను కట్ట కట్టాను” మల్లయ్య తన నిర్దోషిత్వాన్ని గట్టిగా ఎరుకపరిచాడు.

“ఓహో! నీవు వస్తావని పరిగె కట్టి పెట్టామోయ్. ఈ కుప్పలన్ని పరిగెకట్టి పేర్చినవే. ఏమి వగలమారి మొగాడివిరా?”

“పరిగె ఏరుకోవడం తప్పేనా?” తనకు కలిగిన అన్యాయముపై, ఆ వ్యక్తి యొక్క అంతులేని స్వార్ధముపై ఆశ్చర్యమును కనబరచు ధ్వనితో మల్లయ్య అన్నాడు.

“ఇంకా నీల్గుతున్నావు? పెట్టు అక్కడ ఆ కట్టను” కర్ర లేపాడు.

మల్లయ్య ఇక లాభం లేదని గ్రహించి, దీనంగా తన దీనస్థితిని తండ్రి గతిని తెలిపాడు, బ్రతిమిలాడాడు.

మల్లయ్య బ్రతిమిలాడడంతో, తప్పకుండా ఆ కట్ట దొంగిలింపబడినదనే గట్టి నమ్మకం ఆ వ్యక్తికి కలిగి “ఎవడికి పుట్టావురా??” అని ఇంకా రౌద్రముతో కర్ర లేపి కొట్టబోయాడు.

ఇక నిలబడితే లాభము లేదని పరిగెకట్టెను చంకలో గట్టిగా పట్టుకొని కాలికి బుద్ధి చెప్పాడు. ముందు మల్లయ్య వెనుక ఆ వ్యక్తి, గ్రామం ముఖం పట్టారు.

మల్లయ్య తండ్రిని చేరుకోవాలె. పరిగెకట్టను ఎలాగైనా రక్షించుకోవాలె. చెల్లెలుకు, తండ్రికి రాత్రికి ఇన్నిమెతుకులు పెట్టాలె అనే నిశ్చితాభిప్రాయమునకు తన బలాన్ని చేయూతనిచ్చి, సర్వశక్తుల నుపయోగించి వడిగా పరుగెత్తుతున్నాడు.

గ్రామములో మార్గమధ్యముననున్న చావిడి వద్దకు తుడుచుకుంటూ ఒక గోడ ప్రక్కన నిలబడి ఉంది. పోలీసు పటేలు బండ బూతులు తిడ్తున్నాడు.

సాయంత్రం మల్లయ్య పొలాల వైపు వెళ్ళిన తర్వాత మల్లయ్య కొరకు పోలీసు పటేలు కబురంపాడు. ప్రక్క గ్రామం అత్యవసర పనిమీద వంతుపోవలసి వుంది. ఇంట్లో మల్లయ్య లేనందున తండ్రి ప్రమాదస్థితి సై ఏడుస్తు కూర్చున్న చెల్లెలును సేతుసింధీ తీసుకెళ్ళాడు. చెల్లెలును పంతకుపొమ్మని ఒత్తిడి చేస్తున్నాడు. చెల్లెలు ఏడుస్తూ తన తండ్రి అవస్థ పోలీసు పటేలుకు తెలుపుతు ఉంది.

ఇంతలో అన్న మల్లయ్య పరుగెత్తుకు రావడం తనను “పోలీసు పటేలు ఎర నుండి రక్షించడానికని

భావించింది. “

కాని ఇద్దరూ వలలో చిక్కారు. మల్లయ్యను చూడగానే బావురుమని ఏడుస్తూ మల్లయ్య పంచ చేరింది.

ఇంతలో వెనుకనుండి పరుగెత్తి వస్తున్న వ్యక్తి అమాంతంగా మల్లయ్య వీపు పై బలంగా చేతికర్రతో

దెబ్బ వేశాడు.

చస్తిన”ని మల్లయ్య, అతని చెల్లెలు కిందపడిపోయారు. ఒకరిపై ఒకరు పడి ఏడుస్తున్నారు. మల్లయ్య వెంబడించిన ఆ వ్యక్తి పోలీసు పటేలు ముందు ఆ పరిగెకట్టను పెట్టి అది తన వరికుప్ప నుండి మల్లయ్య దొంగిలించాడని ఫిర్యాదు చేశాడు.

పడి ఏడుస్తున్న మల్లయ్యను చెల్లెలు నుండి వేరు చేసి చావిడి స్తంభానికి కట్టారు. ‘సేతుసింధీలు. చెల్లెలును బలవంతంగా వంతుకు పొమ్మని తిరిగి పోలీసు పటేలు బలవంత పెట్టసాగాడు.

పడి ఏడుస్తున్న మల్లయ్యను చెల్లెలు నుండి వేరు చేసి చావిడి స్తంభానికి కట్టారు. ‘సేతుసింధీలు. చెల్లెలును బలవంతంగా వంతుకు పొమ్మని తిరిగి పోలీసు పటేలు బలవంత పెట్టసాగాడు.

“దీని తండ్రికి ఎట్లా ఉందోయ్” క్రూర పాలకయంత్రములో భాగమై మానవత్వాన్ని చంపుకొని చండపాలన చేస్తున్న ఆ పోలీసు పటేలు నోటి నుండి మానవత్వాన్ని జ్ఞప్తికి తెచ్చు ఒక వాక్యము వెళ్ళింది.

“ముసలితొక్కు ఆరునెలలైంది మంచాన్నిబట్టి. చావక, బ్రతక్క ఉన్నాడు. బ్రతికే ఆశలేదు. కాని ఆ రోజే చస్తాడని అనుకోవడానికి వీండ్లేం బ్రహ్మకొడుకులా? ఒళ్ళొంగక ఏదో వగలు” సేతుసింధీ పోలీసు పటేలుకు జవాబు చెప్పాడు.

ఇంట్లో తండ్రి – ఇవన్ని తన జీవిత అనుభవాలే అన్నట్లు నిర్లక్ష్యంగా పడి ఉన్నాడు పరధ్యానంలో స్మృతి తప్పి.

తుదకు చెల్లెలును బలవంతము చేసి ప్రక్క గ్రామానికి వంతుకు పంపారు. ఝామురాత్రి వేళ బిక్కురు, బిక్కురు మనుకుంటూ దిక్కులు చూస్తూ చెల్లెలు వంతుకు బయలుదేరింది.

తండ్రికి అండగా వున్న చెల్లెలు దూరమైంది. మల్లయ్య నిర్బంధంలో ఉన్నాడు. తండ్రిని కండ్ల చూస్తానో లేదో అని బాధపడ్తున్నాడు మల్లయ్య.

తెల్లవారి మల్లయ్యను పోలీస్ స్టేషన్ కు పంపాడు పోలీసు పటేలు. దొంగనేరము క్రింద మల్లయ్యకు మూడు నెలలు శిక్షైంది.

తండ్రి, చెల్లెలు సంగతి ఏమైందో తెలియదు.

ఒకనాడు జేలు పనిమీద మల్లయ్య బజారుకు పోయ్యాడు. అంగడిలో ఒక పరిచయస్తుడు కనబడ్డాడు. జవానును బ్రతిమిలాడి అతన్ని కలిసికొని మాట్లాడితే తండ్రి మరణించాడనీ,చెల్లెలు ఊరువిడిచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఇల్లు పాడుపడిందని తెలిసింది.

ఉబికి వసున్న పట్టరాని దుఃఖాన్ని బహు కష్టంగా ఆపుకున్నాడు. పెదగా ఏడిస్తే పదిమంది కూడ్తారు. దయతలచి మాట్లాడ అవకాశమిచ్చిన జవానుకు మాట వస్తుంది.

లోపల, లోపల కుమిలిపోతున్నాడు. అన్నంతిని గదిలోకి చేరిన తర్వాత ఇక ఏడ్వవచనుకున్నాడు. సర్వ స్వతంత్రుడునని భ్రమపడి పెద్దగా ఏడ్చాడు.

“మా చెల్లెలు ఏమైందో.” తపిస్తున్నాడు. హృదయంలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com