తెలంగాణ రచయితల సఘం, వరంగల్ ఆధ్యర్యంలో ప్రతినెల నిర్వహిస్తున్నటువంటి కవిత్వంతో కలుద్దాం కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6గంటలకు ఆన్లైన్ వేదిక జూమ్ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెరసం జిల్లా అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వరంగల్ కు ఒక గొప్ప వారసత్వం ఉందని, నాటి పాల్కురికి సోమనాథుడు, పోతన నిన్నటి ప్రజాకవి కాళోజీ ఆధునిక కవుల వరకు మనుషుల పట్ల ఒక ప్రేమ తండ్లాట కనిపిస్తుందని, ఆ విషయంలో వారి బాధ్యత వర్తమానం నెరవేర్చాలని అన్నారు. ఫలితం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఫలితం సాధన కోసం అంతే కృషి చేయాలని కవులకు సూచించారు. ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి, సినియర్ కవిగా హాజరైన ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యగారు వచన కవిత్వంలో ప్రత్యేక గొంతుక అని, తను రైతు పక్షపాతి అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి గారు దర్భశయనం శ్రీనివాసచారి గారి పరిచయాన్ని అందించారు. అనంతరం సమన్వయకర్త బిల్ల మహేందర్ మాట్లాడుతూ కవిత్వంతో కలుద్దాం కార్యక్రమం ద్వారా కొత్త కవుల రచనలను ప్రోత్సహించడం, వారిలో కవిత్వ నిర్మాణం, మెలకువలు తదితర అంశాలను పెంపెందించే లక్ష్యం లాంటి నిర్దిష్టమైన అంశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తర్వాత ఎంపిక చేయబడిన పదిమంది కవులు కవిత్వపఠనం చేశారు. ఆ కవితలను దర్భశయనం శ్రీనివాసచారి గారు విశ్లేసిస్తూ కవికి తన అశక్తత తెలిసుండాలని, ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని తప్పని సరిగా అధ్యయనం చెయ్యాలన్నారు. కొత్త పదబంధాలు సృష్టించడంతో పాటుగా కవితలల్లో ఉపమానాలు చేర్చడం వల్ల కవితకు అదనపు ఆకర్షణ వచ్చి చేరుతుందన్నారు. కవి తన మూలాలను మరవ వద్దని, కవిత్వం రాయటం ఎంత ముఖ్యమో దాన్ని శ్రోతలకు ప్రజెంట్ చేయటం అంతే ముఖ్యమన్నారు. ప్రచారం కోసమో, మెప్పు కొసమో కవిత్వం రాయకూడదన్నారు. ఎవరూ పరిపూర్ణులు కాదని, మనది అసంపూర్ణ ప్రయాణం అనిగుర్తుంచుకోవాలన్నారు. కవి ఎప్పుడూ సామాన్యుడేనని, అతనికి వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. కవి అనుభవం నుండి వచ్చిన కవిత గాఢత కలిగి ఉంటుందని ,వాతావరణాన్నిబట్టి వస్తువు కొత్తగా తీసుకోవాలన్నారు. కవిత్వానికి భాష గొప్ప మూలకమని, భాష పునర్నిర్మాణం జరగాలని సూచించారు. మనుషుల మాటలను ఎప్పటికప్పుడు వినాలని, తద్వార గొప్ప పదసంపద తెలుస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో నెల్లుట్ల రమాదేవి, నాగిళ్ళ రామశాస్త్రి, బ్రహ్మచారి, పోరెడ్డి రంగయ్య, వి. శంకర్ , ఉదయశ్రీ, రత్నమాల, గట్టు రాధిక, బాలబోయిన రమాదేవి, కార్తీక రాజు, వడ్లకొండ దయాకర్, వకులవాసు తదితరులతో పాటుగా మొత్తం 50కి పైగా కవులు పాల్గొన్నారు.