ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్ జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్య రంగానికి శంఖ ఘోష్ చేసిన సేవలకు గానూ 2016 లో ఈ పురస్కారం వరించింది. మోడరన్ బెంగాలీ సాహిత్యంలో దిట్టగా శంఖ ఘోష్ పేరుగాంచారు. శంఖ ఘోష్ ప్రయోగాత్మక కవిత్వ రూపాలతో అరుదైన శైలిలో రచనలు చేశారు. ఆయన కవితాశిల్పంలో ఆధునికత, వర్తమాన అంశాలు అందంగా ఒదిగిపోయాయి అంటారు సాహిత్య మేధావులు. రచనల్లో అద్భుతభావ ప్రకటన ఆయన ప్రత్యేకత.
అదిమ్ లతాగుల్మోమే, ముర్ఖా బారో, సమాజిక్ నే, కబీర్ అభిప్రాయ్, ముఖ్ దేఖే జే బిగ్యాపనే, బాబరర్ ప్రార్థనా’ వంటివి ఘోష్ ప్రముఖ రచనలు. ఆయన రచనలు హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, మలయాళం తదితరాలతో పాటూ కొన్ని విదేశీ భాషల్లోకి అనువాదమైనాయి. అంతకు ముందు శంఖ ఘోష్ కు 2011 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.
నోబెల్ సాహితీ పురస్కారం- 2018…ఓల్గా టొకర్జుక్
పోలండ్ రచయిత్రి ఓల్గా టొకర్జుక్కు 2018 లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి లభించింది. సమగ్ర భావావేశంతో, పరిమితులను అధిగమించే జీవన విధానాన్ని వర్ణించే చక్కటి కల్పిత కథనం రాసినందుకు ఓల్గాకు నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ఓల్గా టొకర్జుక్ మొదటి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురితమైంది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి 1980వ దశకం వరకు పోలండ్ చరిత్రను వివరించే ‘ప్రైమ్వల్ అండ్ అదర్ టైమ్స్’తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె రాసిన ‘డ్రైవ్ యువర్ ప్లౌ ఓవర్ ద బోన్స్ ఆఫ్ ది డెడ్’ నవల జంతువుల్ని చంపటాన్ని చూసి సహించలేని ఒక వృద్ధ మహిళ ఆవేదనకు అద్దం పడుతుంది. స్త్రీవాది అయిన ఓల్గా మహిళా హక్కుల గురించి పోరాటాలూ చేస్తుంటారు.