బమ్మెర పోతన – మహాభాగవతము
బమ్మెర పోతన పేరు గురించి భాగవతం గురించి తెలియ తెలుగువారుండరు. భక్తి భావమును తీయగా తేటగా
తెలుగులో మధురాతి మధురంగా పంచిన కవి పోతన. రాజులనాశ్రయించక తన భాగవతమును శ్రీరామునకంకిత మిచ్చి నాటికాలంలో రాజులనెదిరించిన ధీరకవి. ఓరుగల్లు సమీపంలో బమ్మెర గ్రామవాసి. తల్లి లక్కమాంబ.తండ్రి
కేసనమంత్రి. వీరభద్ర విజయము, భోగినీ దండకము ఇతర రచనలు. పరమ భక్తుడు. భాగవతంలో కొన్ని భాగాలు
ఆయన శిష్యులు ఏర్చూరిసింగన, బొప్పరాజు గంగన, వెలిగందల నారన రాశారు. పోతన పద్యాలు తెలుగు వారి ఇండ్లలో నిత్యపారాయణాలుగా నిలిచిపోయాయి. ఆయన పద్యాలు మందార మకరందాలు.
ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రింకేలా విడంబింపగా
రండో బాలకలార! చల్ది కడువం రమ్యస్థలంబిక్కడే
దండన్ లేగలు నీరు ద్రావియిరవందన్ పచ్చికల్ మేయుచున్
దండంబై విహరించుచుండగ సమ్మోదప్రీతి భక్షింతమే
జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న రే
కుల చందంబున కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్
శిలలుం పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులా
కులు కంచంబులుగా భుజించిరచటన్ గోపాలకుల్ భూవరా!
మాటి మాటికి వ్రేలు మడిచి యూరించుచు
యూరుగాయలు తినుచుండు నొక్క
డొకరి కంచములో దొడరి చయ్యన మ్రింగి
చూడు లేదని నోరు చూపునొక్క
డేవురార్దుర తల్లులెలమి బన్నిదమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్క
డిన్నియు దగపంచి యిడుట చెంచెలితన
మనుచు బంతెనగుండు లాడు నొకడు
కృష్ణు చూడుమనుచు గికరించి తన మ్రోలి
మేలి భక్ష్య రాశి మెసగు నొకడు
నవ్వు నొకడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకడు మురియు నొకడు
సంగడీల నడుమ చక్కగ కూర్చుండి
నర్మభాషణముల నగవు మెరసి
యాగభోక్త కృష్ణుడమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్దిగుడిసె