మహాభారతం విశ్వకావ్యం
మహాభారతం ఒక్క మనదేశానికే కాదు అది విశ్వానికి సంబంధించినదని,ఏకబిగిన చదివే విధంగా వ్యాసాలను సమకూర్చారని,ఈ గ్రంథం ప్రతి గ్రంథాలయంలో ఉండదగిన,విలువలతో కూడినదని ఏనుగు నరసింహారెడ్డి అన్నారు.ఆదివారం రోజున కరీంనగర్ లోని ఫిలింభవన్లో ఉదయసాహితీ సంస్థ అధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన, జి.వి.కృష్ణమూర్తి ప్రార్థనా గీతం ఆలాపనతో ప్రారంభమయిన కార్యక్రమంలో కరీంనగర్ అదనపు పాలనాధికారి తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ ప్రధాన కార్యదర్శి డా.ఏనుగు నరసింహా రెడ్డి” మహాభారతం-సమకాలీనత” గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాభారతంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని,ఎన్నిసార్లు భారతాన్ని చదివినా ఎప్పుడు కొత్తగానే ఉంటుందని,భారతంలోని పాత్రలను విశ్లేషిస్తూ,పాత్రల వైశిష్ట్యాన్ని వివరిస్తూ,నేటి సమాజం మహాభారతం లోని పాత్రలను ఎలా ఆదర్శంగా తీసుకోవాలో తెలుపుతూ ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి 53 మంది రచయితలు రాసిన 56 వ్యాసాలను సంకలనం చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చిన వైరాగ్యం ప్రభాకర్ అభినందనీయుడు” అన్నారు.భారతంలో ఉన్నదే ప్రపంచంలో ఉందని,భారతంలో లేనిది ప్రపంచంలో ఉండదని,భారతం నుండే మనం ఎన్నో విలువలను పెంపొందించుకోవచ్చని తెలిపారు.కవి,విశ్రాంత ప్రధానాచార్యులు అన్నాడి గజేందర్ రెడ్డి గ్రంథ పరిచయం చేశారు.అధ్యక్షులువైరాగ్యం ప్రభాకర్ ,యూనివర్సిటీ ఆచార్యులు నుండి మొదలుకొని గృహిణి వరకు ఈ మహత్కార్యం లో పాల్గొని మంచి వ్యాసాలు అందించిన రచయితలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ప్రముఖ కవి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్”ఆధునిక రచయితలు భారతం పై రాసిన భారత గ్రంథాలతో పాటు కవిత్రయం వారి భారతం,సంస్కృత భారతాలను కూడా ఆధార గ్రంథాలుగా రచయితలు తీసుకోవడం అభినందనీయమని” తమ వాయిస్ మెస్సేజ్ లో తెలిపారు. మహామహోపాధ్యాయ , రాష్ట్రపతి సన్మానిత శలాక రఘునాథాచార్యులు ,దాస్యం సేనాధిపతి వాయిస్ మెస్సేజ్ ల రూపంలో అభినందనలు అందించారు. కార్యక్రమంలో యస్.ఆర్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ ,సాహితీ గౌతమి అధ్యక్షులు గండ్ర లక్ష్మణరావు,విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ పద్యం కవి వి.ఆర్.గణపతి ప్రసంగించారు.కార్యక్రమంలో టి.నవనీతరావు,మాడిశెట్టి గోపాల్,అనంతాచార్య,కూకట్ల తిరుపతి,బొమ్మకంటి కిషన్,దొమ్మటి శంకర్ ప్రసాద్, వైరాగ్యం రమేష్,కంకణాల రాంరెడ్డి,గుండు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద జయంతి సభ
జనవరి 11న శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద జయంతి సభలో వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నేటినిజం దినపత్రిక సంపాదకులు బైస దేవదాసు, తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు. వేదిక పై గాయకుడు
త్రినాథరావు, కళా జనార్దనమూర్తి, శివపార్వతి.
నానీలపై జాతీయ సదస్సు
ఖమ్మం ఎస్ ఆర్ &బిజిఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల తెలుగు శాఖ మరియు గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐక్యుఎసి సంయుక్త గా తెలుగు నా నీలు-ప్రక్రియ-తత్త్వం అనే అంశంపై 19-1-2021న. నాల్గవ అంతర్జాల జాతీయ సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు లో నా నీ ల రూపకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపి ముఖ్య అతిథిగా పాల్గొని వచన కవిత్వం లో విభిన్నంగా జీవన అనుభవాలను కవితాత్మకంగా వ్యక్త పరిచారు. ఎస్. రఘు, జరుపుల రమేష్, రత్న ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.