…. సురవరం ప్రతాప రెడ్డి

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి. చరిత్రకారులుగా, సంస్కృతి పరిశోధకులుగా, విమర్శకులుగా, కవిగా ప్రసిద్దులు సురవరం.  తెలంగాణలో కవులు లేరు అనే ఆక్షేపణకు గోలకొండ కవులు సంచికతో దీటైన జవాబు చెప్పిన కార్యశూరులు. పదకొండు అనగపు కాయలకు పన్నెండు మంది ఆయగాండ్ల మోసం. మొగలాయి జమానాలో కర్ర ఎవనిదో బర్రె వానిదే అనే సామెతకు నిదర్శనంగా నిలిచిన కథ ఇది. ఒక అమాయకుడు తుదకు లక్షాధికారి ఎట్లా అయినాడో  చెబుతారు రచయిత.  1896-1953 లో జీవించిన సురవరం తన రచయితల్ని సరళ గ్రాంథికంలో వేలయించారు. ఆనాటి రచనా సంవిధానాన్ని వస్తువును పరిచయం చేయడానికి ఈ కథ.

                                                                               …ఎడిటర్

ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనేదానికి వెళ్ళినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరం చేస్తూవున్నారు. అంతలో మాలీప టేల్ వేంచేసి నాడు. “ఒరేయ్! ఈడ కూర్చో మని నీకెవరు సెలవిచ్చినారు? మంచి మాటలతో ఒక కాయ ఇచ్చిపో” అంటూ తానే ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుకుంటూ ఉన్నాడు. అంతలోనే గోరు చుట్టుమీద రోకటి పోటన్నట్లుగా పోలీసు పటేలు హాజరైనాడు. “పట్టుకొని రారా వాన్ని. ముసాఫిర్ల లెక్కలో వాని పేరు రాయాల్సిందివుంది” అని గర్జించినాడు. తలారివచ్చి తనపాలి వక కాయ, పటేలు పాలిటి వక కాయ లాగుకొని పోయినాడు. కొంత సేపటికి పెద్ద తలారివచ్చి నాడు. “ఏయ్, మొన్న నీవంటివాడే వచ్చిండెను. పొద్దు మునిగినప్పుడు  కూరగాయలమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ళ యింట్లో కన్న వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్” అంటూ తానున్నూ లు కాయ చేతబట్టుకున్నాడు. “అయ్యా! మారాజా! నేను దొంగను దొరను కాను. పొరుగూరు వాన్ని. ఎల్లప్పటికిన్ని వచ్చి పొయ్య, ఇప్పటికే మూడు కాయలు ఎగిరిపోయినవి మళ్ళీ నీవెక్కడినుంచి ఊడి పడితివి అని కాపువాడు మొరపెట్టుకున్నాడు. అదే కాయతో వాని నెత్తిన పొడిచి, కాయతో చక్కాపోయినాడు పెద్ద తలారి. ఈ విధంగా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన 11 మంది ఆయగాండ్లు ఒకరివెనుక వకరువచ్చి కాయలన్నీ లాగుకుని పోయినారు. కాపువాడు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికిపోయినట్టి కర్ణమయ్య అప్పుడే వానికి ప్రత్యక్షమైనాడు. ఏమిరా ఏడుస్తున్నావు?నిన్నెవరేమన్నారు నాకు చెప్పు. నేనీవూరి కర్ణాన్ని. తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను” అని అన్నాడు. న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈవూరిలో ఉన్నాడురా నారాయణా అని అనుకొని కాపువాడు తన 11 సొరకాయలు మాయమైన విధమంతా వినిపించి “అయ్యా కరణమయ్యా, నీవే నారాయణమూర్తివి. నన్నెట్లన్నా గడ్డ కేయండి ” అని గొంగడి ఆయన కాళ్ళ మీద వేసి కాళ్ళు పట్టుకొన్నాడు. కర్ణం ఒక్క తన్ను ఝుడించి తన్ని కంబడి లాగి చంక బెట్టుకొని ఇట్లన్నాడు: “అరే లుచ్చా! అందరికీ వంతు సొరకాయ యిచ్చి నావంతు తప్పించి నావా? నేను తలారివానికంటే పనికి రానివాన్నా? వడ్లోనికంటే వ్యర్ధుడనా? ఆ ఓనమాలురాని మాలీపటేలు నీకు ఎక్కువైనాడా? తే! నా వంతు సొరకాయ. అదిచ్చి యీ గొంగడి తీసుక పో” అని  గ్రుడ్లెర్రచేసుకుని కంబళి తన చంక బెట్టుకొని తన యింటికి పోయినాడు.

కాపువాడు ఎగాదిగా చూచినాడు. “నీవూ ఇంతేనా? ఈ వూరంతా ఇంతే! ఏందేశం యిది పాడు దేశం. ఇంక నావంటి దిక్కులేనివారు బదికే దెట్లా?” అని గొణుగుతూ పట్వారివెంట కొంతదూరం దీనంగా ప్రాధేయ పడుతూ వెళ్ళినాడు. “ఒరేయి! ఒక్క అడుగు ముందుకు వేస్తే నీతలకాయ పగులతంతా( జాగ్రత్త) ఖబర్ధార్?” అన్నాడు పట్వారి. కాపువాడు దిక్కుతోచకుండా నిలిచిపోయినాడు. చిన్న పిల్లవానివలె కొంత సేపు ఏడ్చినాడు. ఒకరిద్దరు ఆడవారు వాన్ని చూచి “పో నాయనా! పో! పొద్దున్నే ఎవరిముఖం చూచినావో ఏమో! యీవూళ్ళో అందరూ ఇట్లాటి మారాజులే. ఇంకోమారు రావద్దు” అని బుద్ధి చెప్పినారు. కాపువాడు దీర్ఘాలోచన చేస్తూ ఇంటి బాట పట్టినాడు. “థూ. పుట్టితే పటేలు పట్వారి అయి పుట్టాలె. లేకుంటే తలారిగా అయినా పుట్టాలే. ఈ బదుకు బతికినా వకటే చచ్చినా వకటే …… కాయలుపోతే పోయెకాని గొంగడికూడా పోయింది. అందరికందే ఆకర్ణమోడు మరీ చెడ్డవాడు. అందుకోసరమే కాటికి పోయినా కర్ణంపీడ తప్పదన్నారు. పెద్దలు . . . . . . దీనికి బదలా తీయ కుంటే నేను మనిషినా? అయితే బీదోన్ని ఏమి చేయగలను? ఆ తలారికి చేరెడు చేనన్నా లేదు. నాకు చేనుంది. పెండ్లాము పైన వంకివుంది ఒక ఎద్దుంది. తలారికంటే తక్కువనానేను? …… దేవునికై నా దెబ్బే గురువు. నేనున్నూ ఏదో మొండితొండిచేస్తా…….” ఇట్లా ఆలోచనా పరంపరలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డ పై కూర్చున్నాడు. ఇంకా దీర్ఘాలోచనలోనే ఉన్నాడు. తటాలున మెరుపు మెరసినట్లా వాని తలలో వక ఆలోచన తళుక్కుమంటూ ప్రవేశించింది. చటుక్కున లేచినాడు. ఊళ్ళోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్ళి “ఒసేయి! నీ వంకి ఇట్లాతే. ఇయ్యమంటే! నీకేం పర్వాలేదు తే. మళ్ళీ వుగాదినాటికి ఒకటికి నూరువంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య! అనూ” అని వంకీని లాగుకున్నాడు. పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ళ దూరంలో ఉండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజాలు పగిడీ, నడుముపట్టి, బిల్లలు మొదలైన పరికరాలు సిద్ధముచేసుకొన్నాడు. నలుగురు అరబ్బు జవానులను జత చేసుకున్నాడు. వారికి బిల్లులు  తగిలించాడు. తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు. ఒక బగ్గిని కిరాయకు మాట్లాడుకొన్నారు.]

రెండామడల దూరంలో ఒక పెద్దబస్తీ ఉండింది. అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారిపేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యే స్థలం. ఆ గ్రామంలో మన కాపు చేరినాడు. ఊర బావిగట్టున ఒక పెద్ద మర్రిమానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దునే ఊరులోని ఆడవారు నీటికి వస్తే ఆ జవానులు “ఖబర్దార్, కడవకొక పైసాయిచ్చి నీళ్లు తీసుకోండి” అని బెదిరించినారు.  పటేలు పట్వారీలు వచ్చినారు. “ఒరేయ్! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్” అని ఉర్దూ ముద్రలతో నుండే ఫర్మాను చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారు లూరకైనారు.

దినమున్నూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట మొదట దినం 20 రూపాయల వరకు వసూలైంది. క్రమేణ ఆదాయం ఎక్కువైంది. “మర్రిమాన్ పరిగణా సుంకం” చుట్టూ రెండామడవరకు ప్రసిద్ధి అయిపోయింది.  ఇట్లా వారాలు, నెలలు, సంవత్సరాలు గడచినవి. ఒక నాడు సుబేదారు దౌరావచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే “పైసా లావ్” అన్నారు జవానులు. వారు ఉత్త కడవలతో వాపసు పోయి “సర్కార్! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్ళు తీసుకోనివ్వకు. అరే సుబేదార్ సర్కారు వారికిరా! అంటే జంబియాలతో పొడిచేదానికే పైబడవస్తారు సర్కార్!” అని విన్నవించు కొన్నారు. అక్కడనే సేవలో ఉన్నట్టి పటేలు పట్వారీ లిట్లన్నరు. హుజూర్ ! పదేండ్ల నుండి యీ మర్రిమాన్ పరగణా సుంకం సక్రమంగా వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది.”.” ఉంటే ఉండవచ్చును” అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొన్నాడు.

ఒకనాడు దీవాన్ బహద్దుర్ గారు అక్కడ డేరావేయించినాడు. అతనికిన్నీ ఇదేగతి పట్టింది. అరబ్బులు కడపకు పైసా పెట్టింది ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవాను గారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు : “మా హుజూర్ గారు ఫర్మానిచ్చినారేమో లేకుంటే నావద్ద కూడా వసూలు చేసే గుండెవుందా వీనికి?” దీవానుగూడా సుంకం చెల్లించుకొన్నాడు. ఇక కాపువాన్ని పట్టపగ్గాలు లేవు. సుబేదారేమిటీ దీవాను బహద్దరు కూడా కిక్కరుమనకుండా సుంకం చెల్లించుకొని పోయివుంటే అబ్బా ఏం దర్జారా వీనిది అని జనులు చాటున అనుకునేవారు. ఇట్లావుండంగా నవాబుగారు షికారుకు పోతూపోతూ పొద్దుపోయిందని రాత్రికి ఆపూరు లోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కావువాని కెవ్వరున్నూ కంటికాగే అట్లు కనబడలేదు. పైసా ఆడ పెట్టి బావిలోకి దిగూ అన్నాడు నవాబు నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబు గారిట్లా తమలోనే అనుకున్నారు: “మాదివాన్జీ మాఖజానా భర్తీచేసేదానికి ఈ హుకుం ఇచ్చినాడేమో పట్నంపోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడు మాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధున్నై ఉండాల్సిందే” అని  ఆలోచించుకొని తానున్నూ నీటి సుంకం చెల్లించుకొన్నాడు.

ఈపాటికి మర్రిమాన్ పరిగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపువానివే. 100 ఎద్దుల సేద్యం సాగించి నాడు. చుట్టూ 5 ఆమడదూరం అప్పులిచ్చినాడు. నవాబుగారు తమ నగరానికి వేంచేసిన తర్వాత దివాన్జీని పిలిచి “దివాన్‌ సాబ్, మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయముకాదా?” అని విచారించినాడు. అందుకు దీవానుగారిట్లు మనవిచేసుకొన్నారు: “బందగానే ఆలీ, హుజూర్ ! నేనున్నూ మీతో ఆలాగే గుజారిష్ (మనవి) చేసుకో వాలె అని వుంటిని. నేనుకూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్ గారు ఫర్మానె ముబారక్ జారీచేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను.” “అరే నీవూ హుకూం ఇయ్యలేదు. నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్ల నుండి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాన్ని గిరఫ్తారీ (అరెస్టు) చేయించి తక్షణం పట్టి తెప్పించు” అని నవాబుగారు ఉరిమినారు.

కాపు వాడు ఇట్టి ఫర్మానుకొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు. 1000 అప్రఫీలు బంగారు తట్టలో పోసుకొని  జర్రీ పనిచేసిన మఖ్మల్ బట్టపైన మూసుకొని కాపువాడు హుజూరి వారికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచేవరకు నవాబు గారు చల్లబడ్డారు. “క్యారే నీకీయెవ్వర్ నీటి సుంకం హుకుం ఇచ్చినార్? “అన్నారు నవాబ్ గారు.  “హుజుర్ ! గ్యారా కద్దూ బారా కొత్వాల్ హుకుం ఎట్లా ఏర్పడిందో మర్రిమాన్ పరిగణా సుంకం కూడా అట్లే ఏర్పాటైంది” అన్నాడు కాపు. “ఏమంటున్నావురా? నీవనే దేమిన్నీ అర్థం కాలేదు. సరిగా చెప్పు.”

“నా తప్పులంతా మాఫ్ చేస్తామని సెలవిస్తే అన్ని మనవి చేసుకుంటాను.” “సరేలే! చెప్పుచూస్తాం.”

కాపువాడు తన కథంతా వర్ణించి వర్ణించి చెప్పుకొన్నాడు. హుజూరు వారు అదేపనిగా నవ్వుతూ సాంతం విని “అరే! నీవు చాలా హుషారు మనిషివి.  నీతప్పంతా మాఫ్ ఇక ముందు నీవు మాదేవిడీ రాత్రి గంటలు కొట్తూవుండుము. అదే నీకు శిక్ష” అని సెలవిచ్చినారు. కాపు వానికి కొన్నాళ్ళవరకు తిక్క లేచినట్లుండింది. ఏమిన్నీ ఆదాయం లేదు.  అధికారం లేదు. అడిగేవారు లేరు. రాత్రులంతా నిద్రకాయవరెను. ఒకనాడు నిద్రమబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరచిపోయినాడు. 12 గంటలకు లేచి 12 కొట్టినాడు. ఈ చిన్న పొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందయ్యింది.

హుజూరు వారు 8 గంటలనుండి గంటకొక బేగం గారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 గంటల బేగంగారు గంటలకాపును పిలిపించి “అరేయ్! నా గంట మరచిపోకుండా కొట్తూ వుండుము. నెలకు 500 రూపాయీలిస్తాను” అని అన్నది. “చిత్తం, చిత్తం హుజూర్ !” అని కాపు వాడు తత్తరపాటుతో అన్నాడు. “ఈ గంటలలో ఏమోరహస్యం ఉందిరా” అని కాపువానికి స్ఫురించింది. ఒక నాడు 9 తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంటతప్పితే మరునాడే ఆ గంట బేగంగారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. ఈ విధంగా నెలకు 400 రూపాయీల జీతం ఏర్పాటైంది కాపువానికి. కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతికూడా తెలిసింది. వీడు చాలాకీ వాడు అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికి నాముగా ఇచ్చి పంపివేసినాడు. చూచినారా సొరకాయ మహిమ! సొరకాయ నరుకుట అంటే ఇట్లాంటి కథలు చెప్పేదానికే అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com