రచనా వ్యాసాలు ఓ చెలమ లాంటివి
కవి ఏకాంతం కోరుకుంటాడు కానీ, ఒంటరితనం కాదు… అంటున్న కవి, రాజేందర్ జింబోతో మామిడాల ముఖాముఖి…
తంగేడు: ‘జింబో’ ఈ కలం పేరు వెనకాల కథేమిటి?
జవాబు: (చిన్నగా నవ్వి) ఈ ప్రశ్న ప్రతి ఇంటర్వ్యూలో వస్తూ వుంటుంది. ఎందుకంటే జింబో అన్న పేరు చాలా మందికి ఆశ్చర్యం గా అన్పిస్తూ వుంటుంది.
చిన్నప్పుడు చాలా ఎత్తుగా వుండేవాడిని. భారీ శరీరం. పెద్ద పర్సనాలిటీ. మా రఘుపతన్న అప్పుడు హైదరాబాద్ లో యం.బి.బి.ఎస్ చదువుతూ వుండేవాడు. 1962 ప్రాంతంలో అనుకుంటా. సరదాగా నన్ను జింబో అని ఇంట్లో పిలిచేవాడు.అట్లా ముద్దుగా ఇంట్లో వాళ్ళు కూడా పిలవడం ప్రారంభించారు.ఇంట్లో వాళ్ళతో బాటూ స్నేహితులూ, మా వూరి వాళ్ళు అలా పిలిచేవాళ్ళు. నేను ఏడవ తరగతికి వచ్చిన తరువాత అందరితో చెప్పి అలా పిలవడం మాన్పించాను. 62 ప్రాంతంలో జింబో అని జింబో నగర ప్రవేశం అన్న సినిమాలు వచ్చాయి.అందులోని హీరోది కూడా చాలా పెద్ద పర్సనాలిటీ. ఆ సినిమాల ప్రభావం వల్ల మా అన్నయ్య అలా పిలిచాడని అంటారు.
జింబో పేరుతో డిగ్రీ చదువుతున్నప్పుడు ఓ కథ రాసి ప్రగతి వార పత్రికకు పంపించాను. అది వెంటనే అచ్చయ్యింది. ఓ కవిత ఆంధ్రజ్యోతికి పంపిస్తే అది అచ్చయ్యింది. ఆ విధంగా సాహిత్యంలో జింబో పేరు ప్యాచుర్యం పొందింది.
రాజేందర్ పేరుతో రాయండి అని తరచూ ప్రముఖ కవి జ్వాలాముఖి అనేవాడు. అట్లాగే కవి ఇస్మాయిల్ నా రెండక్షరాల కవితా సంపుటి చదివి ఇక పేరు జింబో పేరును వదిలేసి రాజేందర్ పేరుతో కవిత్వం రాయండీ అని ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇప్పటికీ నా దగ్గర వుంది.
నేను న్యాయమూర్తి అయిన తరువాత చాలా మందికి జింబో పేరుతో పలకరించడం ఇబ్బందిగా ఫీలయినారు. అది గమనించి రాజేందర్ జింబో అని మంగారి రాజేందర్ అని రచనలు చేయడం మొదలుపెట్టాను. కొంతమంది సన్నిహితులు జింబో పేరుతో రచనలు కొనసాగించండి అని కూడా అంటూ వుంటారు.మా వేములవాడ కథలు అన్న కథల సీరిస్ రాజేందర్ జింబో పేరుతో నవ్య వారపత్రికలో ఓ ఇరువై అయిదు వారాల పాటు రాశాను. ఆ తరువాత ఎమెస్కో ప్రచురించిన కథల పుస్తకం కూడా రాజేందర్ జింబో పేరుతో వచ్చింది. ఇప్పుడు రాజేందర్ జింబో అని మంగారి రాజేందర్ అని కథలూ, కవిత్వం, వ్యాసాలు రాస్తున్నాను. ఇదీ జింబో పేరు వెనుక వున్న కధా కమామిషూ.
తంగేడు: రచయితగా మిమ్మల్ని ప్రభావితం చేసినవారు ఎవరు?
రా.జి: మా ఇంట్లో ఓ చిన్నపాటి లైబ్రరీ వుండేది. మా రఘుపతన్నకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. శ్రీ శ్రీ, సినారె, దాశరథి,కాళోజీ, బుచ్చిబాబు, చలంల పుస్తకాలు ఎన్నో మా ఇంట్లో వుండేవి. నా చిన్నప్పుడు మా అమ్మని, మా తాతని కథలు చెప్పమని వేదించేవాడిని. కథలు వినడం, కథలూ, కవిత్వాలూ చదవడం వల్ల సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం ఏర్పడింది.
ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు రాకపోవడం వల్ల ఎం.బి,బి,ఎస్. ఎంట్రన్స్ రాయలేకపోయాను. నిజానికి సైన్సు నాకు పడని సబ్జెక్టు. మా అన్నయ్య ఈ విషయం గమనించక నన్ను డాక్టర్ చదివించాలని నన్ను బి,యస్సీలో చేర్పించాడు. సైన్స్ నాకిష్టం లేదని చెప్పే పరిస్థితి అప్పుడు లేదు. అలా బి,యస్సీలో చేరాను. కెమిస్ట్రీ అస్సలు ఇష్టం వుండేది కాదు.ఆ క్లాస్ ఎగ్గొట్టి మా కరీంనగర్ డిగ్రీ కాలేజీ లైబ్రరీలోని సాహిత్యమంతా చదివేశాను. మునిమానిక్యం నుంచి కోడు వరకు అందరినీ చదివేశాను. అంపశయ్య నవీన్ నీ, దాశరథి రంగాచార్యను చదివేశాను.
నేను చదివిన సాహిత్యం, నేను విన్న కథలు, కవి సమ్మేళనాలు నన్ను ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. ప్రశ్చదాం వ్యక్తులు ఎవరూ ప్రభావితం చేయలేదు.
అదే విధంగా పండుగలప్పుడు రేడియోల్లో ప్రసారం అయ్యే కవి సమ్మేళనాలని ఆసక్తిగా వినేవాడిని. లెక్క లేనన్ని పుస్తకాలని అప్పుడు చదివాను.
బహుశ అవి నన్ను కథల వైపు కవిత్వం వైపు నడిపించాయని చెప్పవచ్చు.
తంగేడు: కథ కన్నా కవిత్వమే మిన్న అని మీరు ఒక సందర్భంలో అన్నారు. కారణం ఏమిటి?
తంగేడు: కథ కన్నా కవిత్వమే మిన్న అని నేను అనలేదు. 23.7.2007 రోజున కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు నాతో ‘కథా సంచి’ కార్యక్రమాన్ని బెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో చాలా మంది కవులు, రచయిత లు పాల్గొన్నారు. కథా నేపథ్యం తరువాత రెండు కథలు చదివాను. ఆ తరువాత ప్రశ్నలూ, జవాబులూ నడిచాయి. మిత్రుడు కథ మూడు కాసుల ప్రతాపరెడ్డి నన్ను ఓ ప్రశ్న అడిగారు. మీరు కవిత్వం, కథా ప్రక్రియల్లో రచనలు చేశారు కదా .మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు. ఏది కష్టమైనది? ఏది మిన్న. ఈ ప్రశ్నకి జవాబు గా నా దృష్టి లో రెండూ గొప్పవే. కథ రాయాలంటే శ్రమతో కూడుకున్న పని. ఎక్కువ సమయం తీసుకుంటుంది. కవిత్వం అలా కాదు. వెంటనే రాసెయ్యవచ్చని చెప్పాను.
మనిషి జీవితం కవిత్వంతో అంటే పాటతో మొదలవుతుంది. అమ్న పాట అందరమూ వింటాం. కొంచెం పెద్దగా అయిన తరువాత కథలు ఇష్టపడతాం. కథలు చెప్పమని పెద్దవాళ్ళ వెంట పడతాం. కథా స్థానం కథదే. కవిత్వం స్థానం కవిత్వానిదేనని చెప్పాను. ఇదే అభిప్రాయం తో ఇప్పుడూ వున్నాను.
తంగేడు: జింబో కథలు, రూల్ ఆఫ్ లా కథలు రాశాను. అవి కోర్సులకై నేర న్యాయ వ్యవస్థకి సంబంధించిన కథలు మ అంటే సీరియస్ కథలు. వీటికి భిన్నంగా మీ వూరు వేములవాడ నేపథ్యంలో వేములవాడ కథలు రాశారు. రెండూ పూర్తిగా భిన్నమైనవి. కథా రచయిత గా మీరు ఏ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.?
జవాబు: నిజమే! మీరన్నది చాలా వాస్తవం. జింబో కథలు రూల్ ఆఫ్ లా కథలు, నేర న్యాయ వ్యవస్థ కి సంబంధించిన కథలు నేను న్యాయవాదిగా అదే విధంగా న్యాయమూర్తి గా చూసిన జీవితం గురించి, రాసిన కథలు అవి. పోలీస్ స్టేషన్ లో, కోర్టు ల్లో నలిగిపోతున్న జీవితాలని ఈ కథలో రాశాను. నిన్న మొన్న, నేడు రేపు, జమానల్, ఫైలు, శ్వాస లాంటి కథలు చదివితే నాకే ఆశ్చర్యం వేస్తూ వుంటుంది. న్యాయమూర్తి గా పనిచేస్తూ, ఈ కథలు ఎలా రాశానని ఇప్పుడు అన్పిస్తుంది. చాలా మంది ఈ ప్రశ్న లని వేశారు.
‘జింబో కథలు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రెండు మాటలు అన్నారు. లోహియా మాదిరిగా రాజేందర్, ఆయన మిత్రుడు క్రిష్ణారావులు సమాజ శ్రేయస్సు కోసం అలజడులు సృష్టిస్తూ వున్నారు. వీళ్లని చూస్తే నాకే భయం అవుతుంది అని అన్నారు. ఆ పుస్తకానికి వెనుక మాట రాస్తూ, పేద ప్రజల పట్ల జరుగుతున్న అన్యాయం, హింసకు వ్యతిరేకంగా స్పందించి రాసిన కథలు జింబో కథలు.
న్యాయమూర్తి చలమేశ్వర్ రూల్ ఆఫ్ లా కథల గురించి ఇలా అన్నారు. ‘ఈ కథలు సందేశాలనివ్వవు. సందేహాలు కలుగ చేస్తాయి. సందేహాల నుండి ఆలోచనలు పుడతాయి. ఆలోచన మనిషి ప్రగతి కి పునాది.
వేములవాడ కథలు మా వూరి కథలే కాదు. అందరి వూర్ల కథలు. జింబో కథలకి, రూల్ ఆఫ్ లా కథలకి పూర్తిగా భిన్నమైనవి. ఇందులో మా వూరు, మా ఇల్లు, మా బాపు, మా అమ్మ, మా వూరు ప్రదేశాలు, మనుషులు, నా బాల్యం కన్పిస్తాయి.
నా కథలు అన్న నా అనుభవం లోంచి వచ్చినవే.మనిషి జీవితం లో ఎన్నో కోణాల వుంటాయి . నేను న్యాయవాది ని, ఆ తరువాత న్యాయవాది ని. వీటన్నింటితో బాటు ఓ మామూలు వ్యక్తి ని. సెంటిమెంట్లు, వూరు, అమ్మ భాషల మీద భావోద్వేగం వున్న రచయిత ను.అందుకని నా కథలో అన్నీ కన్పిస్తాయి.
ఈ కథలతో బాటూ జీవితం మీద ప్రేమ, నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగి వుండటానికోసం కూడా కథలు రాశాను. అవి ‘ఓ చిన్నమాట’ అన్న పేరుతో పుస్తకం గా వచ్చింది. ఎమెస్కో ఆ పుస్తకాన్ని ప్రచురించింది. అలాంటి కథలని అనువాదం కూడా చేశాను. అది ‘కథలకి ఆవల’ పేరుతో వచ్చింది. నా అనుభవాలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. నా అనుభవాల్లో మరెంతో మంది అనుభవాలు కూడా వుంటాయి.
తంగేడు: రావిశాస్త్రి కోర్టు జీవితాలని తన కథల్లో చూపిస్తే, మీరు కథల్లోనే కాదు, కవిత్వాల్లో కూడా చూపించారు. మీ ‘హాజీర్ హై’ కి ప్రేరణ ఏమిటి?
జవాబు: ‘హాజీర్ హై’ ఓ విలక్షణమైన కవిత్వం. ప్రసిద్ధ కవి గోపి మాటల్లో చెప్పాలంటే జింబో మాత్రమే రాయగల కవిత్వం.
న్యాయవాది గా నేను కరీంనగర్ జిల్లా లో, సిరిసిల్ల లో ప్రాక్టీసు చేశాను. అప్పుడు కోర్టుల్లో జరుగుతున్న విషయాలని, కవిత్వీకరించాను. ‘మూడు తలల రాజ సింహం’ అన్న కవి త 1986 లో రాశాను. అది ఉదయం దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించారు. అందులో కొన్ని వాక్యాలు ఇప్పటికీ రిలవెంట్(Relevant) గా వుండటం బాధ కలిగించే విషయం
‘మూడు తలల్తో రాజసింహం
కుర్చి మీద నిఘా వేసుక్కూర్చుంటుంది’
పరిస్థితులు ఇప్పటికీ ఏమీ మారకపోవడం బాధాకరం. న్యాయవ్యవస్థ పరిస్థితులు చూస్తే, జాలేస్తుంది. న్యాయవాది గా, న్యాయమూర్తిగా నేను చూసిన, నేను విన్న ఆక్రందనలు, ప్రశ్న ల సారాంశమే ‘హాజర్ హై’.
‘హాజర్ హై, హాజర్ హై’
‘హాజర్ హై, హాజర్ హై’
ఆమె గుండెల్లో మోగుతూనే వుంటుంది
అక్కడ హాజరు పరచాల్సిందే
ఆమెను కాదు
న్యాయం చెప్పే కోర్టుని’.
ఈ పుస్తకం ఎందుకు విలక్షణమైనదని నేనంటూ వున్నానంటే కోర్టు చక్రాల కింద, పోలీసు బూటు నాడాల క్రింద నలుగుతున్న జీవితాల ఆక్రందనాలు ఎన్నో ఇందులో కన్పిస్తాయి.
న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కి బాగా నచ్చిన కవిత. చలమేశ్వర్ కే కాదు, చాలామంది కి బాగా నచ్చిన కవిత. నాకు కూడా బాగా నచ్చిన కవిత. ‘ఒక్క కేసు చాలు..’ ఆ కవిత ఇలా ముగుస్తుంది
‘కేసులు నిలుస్తాయని పెట్టారు
కేసులు నిలవాలని పెట్టారుకేసులు కేసుల కోసమే పెడ్తారు
కేసులు కేసుల కోసమే పెడ్తారుకేసులు కేసుల కోసమే పెడ్తారుకేసులు కేసుల కోసమే పెడ్తారు
మనిషి ని వంగదీయడానికి పెడ్తారు
మనిషి ని లొంగదీయడానికి పెడ్తారు’
కవిత్వం, కథలు రెండూ రాస్తాను కాబట్టి ‘హాజర్ హై’ లాంటి కవిత్వం రాశాను. జింబో కథలు, రూల్ ఆఫ్ లా లాంటి కథలు రాశాను. వీటన్నింటికీ ప్రేరణ నా అనుభవాలే.
.కోర్టు ల గురించి రాసిన మరో కవితా సంపుటి ‘ఒక్క కేసు చాలు…’అచ్చులో వుంది.
తంగేడు: రెండక్షరాలు, లోపలి వర్షం, చూస్తుండగానే… గురించి వివరిస్తారా?
రెండక్షరాలు కవిత్వం లో ప్రధానంగా అమ్మ, పిల్లలు, భార్య, వూరు లాంటి వాటి మీద ఎక్కువ కవిత్వం వుంటుంది.
రెండు మాటల్లో ఆ కవిత్వం గురించి చెప్పాలంటే అమ్మ ఊరు, వాగు స్నేహం, మోహం, పగ, ద్వేషం, దయ , క్షమ, త్యాగం- అన్న రెండక్షరాలే. జీవితాన్ని ప్రబలంగా శాసించే ఉద్వేగాలన్నీ రెండక్షరాలే. ఇదీ ఆ కవిత్వ సారాంశం.
లోపలి వర్షంలో చాన్నాళ్ళకి కలిసిన స్నేహితులు గులాబీ రెమ్మల కన్నా సున్నితమైన కలలు, నిరంతరం చూసే నీడలేని కళ్ళు, చుక్కలు చుక్కలుగా రాలుతున్న విషాదం, తడిగా తగిలే జ్ఞాపకాలు.. లోపలి వర్షానికి తడవనివాడెవ్వడున్నాడు..?
ఈ రెండింటిలో సెంటిమెంట్ ప్రధానంగా వుంటుంది. కవిత్వం లో భిన్నంగా కవిత్వాన్ని రాశానని నేను అనుకుంటాను. పోలీసులు, కోర్టులు, నేర, న్యాయ వ్యవస్థ ని ప్రతిబింబించే కవిత్వం ‘ ‘హాజీర్ హై’, వూరు, స్నేహితులు, అమ్మ, బాపు, పాప, బాబు, కవిత్వాలని ప్రతిబింబించే కవిత్వం రెండక్షరాలు, లోపల వర్షం.
ఈ రెండింటికీ భిన్నంగా రాసిన మరో కవితా సంపుటి ‘చూస్తుండగానే…’. ఆధునిక జీవితం లోని సంఘర్షణ, మానవ సంబంధాలు, రేపటి మనిషి, రాజు తీర్పు లాంటి అధిక్షేప కవిత్వాలు ఇందులో వున్నాయి. అనగా అనగా …అన్న కవిత ఎందరినో ఆకర్షించింది. సత్యమూర్తి ప్రత్యేకంగా ఆ కవిత మీద ఉత్తరం రాశాడు. కవి మిత్రుడు కోడూరి విజయ్ కుమార్, ఓ మంచి వ్యాసం రాశాడు. ఎన్ కౌంటర్ ల మీద, మోచేయిలు కోల్పోతున్న మనుషుల మీద రాసిన కవిత్వాలు ఇందులో కన్పిస్తాయి.
తంగేడు: కొత్త కవిత్వ పుస్తకాలు, కథల పుస్తకాలు వస్తున్నాయా?
జవాబు: చెట్టులా…ఒక్క కేసు చాలు రెండు కవితా సంపుటాలు రావాల్సి వుంది. చెట్టులా..లో ఆధునిక సమాజ రచనలు కన్పిస్తాయి. ‘ఒక్క కేసు చాలు’ కవిత్వ సంపుటి లో నేర న్యాయవ్యవస్థ ప్రతిబింబిస్తుంది.
జవాబు: చెట్టులా…ఒక్క కేసు చాలు రెండు కవితా సంపుటాలు రావాల్సి వుంది. చెట్టులా..లో ఆధునిక సమాజ రచనలు కన్పిస్తాయి. ‘ఒక్క కేసు చాలు’ కవిత్వ సంపుటి లో నేర న్యాయవ్యవస్థ ప్రతిబింబిస్తుంది.
ఒక కథల విషయానికి వస్తే మా వేములవాడ కథలు రెండవ భాగం, ఫైలు శ్వాస కవిత్వ సంపుటి , ఇంకా రెండు చిన్న కథల సంపుటాలు రావాల్సి వుంది. ఈ కరోనా కల్లోలం వల్ల ఆలశ్యం అయ్యాయి.
తంగేడు: రచయిత కవి spontaneous గానే ఎక్కువ స్పందిస్తున్నారు. పూర్తి కాల కవి/రచయిత గా వుండాలని అనుకుంటున్నారా?
కవి- వెంటనే స్పందిస్తాడు. కథకుడు కొంత ఆలోచించి, సమొ తీసుకుని స్పందిస్తాడు. నవలా రచయిత కొంత ఎక్కువ సమయం తీసుకొని సమగ్రంగా స్పందిస్తాడు.
న్యాయవాది గా, న్యాయమూర్తిగా పనిచేసినప్పటికీ నేను పూర్తి కాల కవిని రచయిత ని. అట్లా వుంటేనే నిరంతరం రాయగలుగుతాం. మా వేములవాడ కథల్లోని ఎల్లయ్య అనే పాత్ర (నిజమైన వ్యక్తే) ఇలా అంటాడు.
“నేను రాయలేను. రచనా వ్యాసంగం ఓ చెలిమె లాంటిది. నీటిని తీసిన కొద్దీ వూరుతాయి. నేను ఆ నీటిని తీయడం మానేశాను. ఊట ఆగిపోయింది. రాయలేను. చదువుతున్నాను. అది చాలు.’
ఎల్లయ్య లో రచయిత వున్నాడు. ప్రయాణం లేక అతను ఆగిపోయినాడు. రచయిత ఎల్లయ్య కావలసిన వ్యక్తి, గాజుల ఎల్లయ్య గా మారిపోయాడు. రచయిత, కవి నిరంతరం ఆలోచిస్తూ వుండాలి. రాయాలని అన్వేషించినప్పుడు రాస్తూ వుండాలి.
తంగేడు: ఈ మధ్య యూ ట్యూబ్ లో కథలు పెడుతున్నారు కదా! ఈ ఆలోచన ఎలా వచ్చింది.తంగేడు: ఈ మధ్య యూ ట్యూబ్ లో కథలు పెడుతున్నారు కదా! ఈ ఆలోచన ఎలా వచ్చింది.
‘మా వేములవాడ కథలు’ యూ ట్యూబ్ లో ఎరితోనన్నా చదివిస్తే ఎలా వుంటుందన్న ఆలోచన వుండేది. అది కరోనా కాలంలో కష్టమని అన్పించింది. కరోనా పాండెమిక్ వచ్చిన తరువాత బయటకు వెళ్లడం చాలా తగ్గి పోయింది. కోర్టు కు వెళ్లడం మానేశాను. లీగల్ సమస్యలు వున్న వాళ్ళని కూడా బయట మా క్లబ్ హవుజ్ లో మాట్లాడి పంపించడం జరుగుతుంది. ఆ దశలో మా మేనల్లుడు వరాల ఆనంద్ నువ్వే చదువు, బాగుంటుంది అన్నాడు. మా అబ్బాయి అనురాగ్ ఎట్లా ఎడిట్ చేసుకోవచ్చో చెప్పాడు . ఓ యాప్ డౌన్ లోడ్ చేసుకోమన్నాడు. ఆ విధంగా నా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది. ఇప్పటికీ నా యాభై కథలు, యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను.
మనిషి అనేవాడు నిరంతరం పనిచేస్తూనే వుండాలి మనిషి గుండెలాగా. మా బాపులాగా. అందుకే నేను నిరంతరం పని చేస్తూనే వుంటాను. కరోనా కాలన్ని ఈ విధంగా సద్వినియోగం చేస్తున్నాను.
25 సంవత్సరాల యువకుల దగ్గర నుంచి 80 సంవత్సరాల పెద్ద వాళ్ళ వరకు నా కథలని చూస్తున్నారు. వింటున్నారు. మీరు ఇన్ని కథలు రాశారా? నేను గమనించనే లేదని కథకుడు నవలా రచయిత ఓసారి ఫోన్ చేసి అన్నారు.
జింబో కథలు విని కవి మిత్రుడు దాసరాజు రామారావు ఇలా అన్నారు. మీ కథా పుట ఒక ఊరట… వినందే నిద్రపట్టదు, విన్నాక నిద్రపట్టదు.
యువకుడు కవి సుఫీ ఇలా అన్నాడు. ఇన్నాళ్ళుగా జింబోని చదవకుండా ఉన్నందుకు సిగ్గేసింది.. ఒక్కో కథని విను, ఒక్కొక్క క్షణం మరణించి మళ్ళీ బతుకు, అసలు బతుకుతున్న దారుల్లో ఎన్ని రంగులున్నాయో, ఎన్ని దుఃఖాలున్నాయో చూడు… ఆఖరున జింబో ఆ కథ రాయటం వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించాడో.. ఆ రూట్ ని పట్టాడో.. అది తిరుగు బాటవ్వచ్చు, నువ్వు కొద్దిగా తిరుగుబాటు అవ్వొచ్చు…యువకుడు కవి సుఫీ ఇలా అన్నాడు. ఇన్నాళ్ళుగా జింబోని చదవకుండా ఉన్నందుకు సిగ్గేసింది.. ఒక్కో కథని విను, ఒక్కొక్క క్షణం మరణించి మళ్ళీ బతుకు, అసలు బతుకుతున్న దారుల్లో ఎన్ని రంగులున్నాయో, ఎన్ని దుఃఖాలున్నాయో చూడు… ఆఖరున జింబో ఆ కథ రాయటం వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించాడో.. ఆ రూట్ ని పట్టాడో.. అది తిరుగు బాటవ్వచ్చు, నువ్వు కొద్దిగా తిరుగుబాటు అవ్వొచ్చు…
ఇలా కవి మిత్రులు, కథాభిమానులు ఎందరో నాతో కనెక్టు అవ్వమన్నారు. పాత మిత్రులు, కొత్త మిత్రులు ఎందరో సన్నిహితులు గా మారిపోయారు.
‘పావు’ కథ చదివి మీరు కథ రాసి న్యాయవ్యవస్థ లో ఎలా బతికి వున్నారో నాకర్థం కాలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం నవ్వుతూ అన్నారు. మా వేములవాడ కథలోని ‘ఆర్ ఎమ్ టీ బస్టాండ్’ కథలో ఓ వాక్యం వుంటుంది. పుట్టిన వూరు మీద కన్నా, బతికిన వూరు మీద భావోద్వేగం ఎక్కువగా వుంటుందేమో అని.. ఆ కథ చదిని హైదరాబాదు కి తన ప్రయాణాన్ని ఆ కథ గుర్తు చేస్తుంది అని.
ఇట్లా ఎన్నో అభిప్రాయాలు- వాటి గురించి వివరంగా వ్యాసమే రాయాల్సి వుంది.
తంగేడు: ‘ఒంటరితనం లేనివాడు కవి మాత్రమే’ అన్నారు. అంతేనంటారా?
కవి అప్పుడప్పుడు ఏకాంతాన్ని కోరుకుంటాడు. కానీ ఒంటరితనాన్ని కోరుకోడు. నిజానికి ఒంటరితనం కవి దరిదాపుల్లో వుండదు. కవిత్వం ఎప్పుడూ అతని వెన్నంటే వుంటుంది
తంగేడు: ‘ఆధునిక కవిత్వం సంక్లిష్టంగా వుంటుంది’ అని అంటుంటారు. కానీ ఏ మాత్రం సంక్లిష్టంగా వుండనిది మీ కవిత్వం. దీనిపై శ్రద్ధ ఏమైనా తీసుకుంటారా?
జవాబు: కొంతమంది కవిత్వం మాత్రమే సంక్లిష్టంగా వుంది. వాళ్ళు మెదడుకు పని చెబుతారు. నేను హృదయానికి పని చెబుతాను. అందుకే సంక్లిష్టత కన్పించదు. మనసును ఆహ్లాదపరుస్తుంది. నా కవిత్వం అంతకు మించి ఆలోచింపజేస్తుంది.
మన మనస్సు సరళంగా పారదర్శకంగా వుంటే కవిత్వమూ అదే విధంగా వుంటుంది. ఇంతకు మించి మరో శ్రద్ధ ఏమేలేదు.
తంగేడు: మంగారి రాజేందర్ గా మీ ప్రయాణం చెప్పుతారా?
జవాబు: మంగారి రాజేందర్ పేరుతో చాలా పుస్తకాలు రాశాను. యాభై ఐదు లా పుస్తకాలని తెలుగులో ఇంగ్లీషులో రాశాను.
నేను రాసినన్ని లా పుస్తకాలు తెలుగులో మరెవ్వరూ రాయలేదు. వ్యాసాలూ అంతే! వారనికి నాలుగు వ్యాసాలు రాసిన రోజులు వున్నాయి.
తంగేడు: తెలుగులో రాయడానికి కారణం ఏమిటి?
జవాబు: తెలుగులో పుస్తకాలు రాసి సామాన్యులకి, యువ న్యాయవాదులకి చట్టాల పరిచయం చేయ్యాలన్నది నా ఉద్దేశం. ప్రజల డిమాండ్ మేరకు, ప్రచురణ కర్తల కోరిక మేరకు రాయల్సినన్నీ పుస్తకం రాయడం లేదు. సాహిత్యం నా ప్రాధాన్యత. దాని వల్ల కూడా రాయలేకపోతున్నాను.
తంగేడు: మీ సాహిత్య ప్రణాళికలు వివరించండి.
జవాబు: కథలు, కవిత్వాలు రాస్తూ వుండటమే ప్రధాన ప్రణాళిక. రెండు మూడు నవలలు రాయాలని వుంది. చూడాలి.
ఇది కాకుండా, సమయం అనుకూలిస్తే లీగల్ డిక్షనరీ రాయాలి. చూద్దాం…
కొత్త పద్దతులను, సాంకేతికత ను ఉపయోగించుకొని సాహిత్యం లో ప్రయోగాలు చేయాలి.
తంగేడు: మంచిది సార్. నమస్కారం. మీ ప్రయాణాలు సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
జవాబు: నమస్కారం.. మీకూ, తంగేడు సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.