యువత ముందుకు రావాలి
ఏదైనా సాహేతీ సభ జరిగితే ఒక మాట తరచు గా వినేవాళ్ళం .సభకు వచ్చిన వక్తలు ప్రేక్షకులు అంతా ఏభై ఏళ్ళు పైబడ్డవారే నని .ఇది నిజం గా సాహితీ భవితవ్యానికి ప్రశ్నార్థకమే అనిపించేది .సాహితీ ప్రియులకు దిగులు కలిగించేది. యువత సాహిత్యం పట్ల ఎందుకింత నిరాసక్తం గా ఉంటుంది ? అని చింత పడే వాళ్ళం .
కాని తెలంగాణ ఉద్యమం వల్ల ఈ పరిస్థితి మారింది .యువ సాహిత్య కారులు పోటెత్తారు .ఆ వరకు కొన సాగిన నిర్లిప్తతకు తెర పడింది .
అదే యువత చాలా మంది ఇపుడు సామాజిక మాధ్యమాలలో కొనసాగుతున్నారు .ఎవరికీ వాళ్ళు కవితలు రాసి వాట్సాప్ ల లో పేస్ బక్ లో ఇతర బ్లాగ్ ల లో పెడుతున్నారు .వాళ్ళ మిత్రులు దాన్ని చూసి లైక్ లు కొడుతున్నారు. ఈ ప్రచారం వల్ల వాళ్ళు గొప్పసాహితీ వేత్తలం అనే భ్రమ ప్రమాదానికి లోనౌతున్నారు .సోషల్ మీడియా ద్వారా తమ రచనలకు ప్రచారం తెచ్చుకోవడం తప్పు కాదు .అసలు రచయిత అనేవాడికి తగిన ప్రకాశం ,ప్రచారం ,ఉండాలిసిందే ,ఇది కాదనలేని అంశం .
అయితే ఎవరికీ వాళ్ళు విదించుకొనే పరిమితులలో ఉంటె వాళ్ళు సాహితీకారులు అయిపోతారా ?రచనలు సాహేతీ చరిత్ర లో నిలుస్తాయా ?సరైన ప్రాపంచిక దృక్పథం, సామాజిక కోణం , ప్రాచీన ,ఆర్వాచీన సాహిత్యాల మీద అవగాహన ,ఇతర భాషా సాహిత్యాల తో ఇతోధిక పరిచయం లేకుండా కేవలం వాచ్యమాత్రం గా ఉన్న రచనల వల్ల సాహిత్యం పుష్టి వంతం అవుతుందా ?ఇది గమనించాలిసిన అవసరం ఉంది .
నాటి దాశరథి , సి.నా.రే. విశ్వనాథ , శ్రీ శ్రీ , జాషువా ,వానమామలై .లాంటి కవులకు ఎన్ని భాషా సాహిత్యాల మీద పట్టు ఉండేది ?వీళ్ళ రచనలలోనూ , ప్రసంగాల లోనూ, ఎంత విఙ్ఞానం తోణికిసలాడేది ?వీళ్ళ నిర్మాణ పద్ధతి లో ఎంత చక్కని సౌందర్య దృక్పథం భాసించేది ?
అట్లాగే వచన కవిత్వం రంగం లోకి వచ్చాక కూడా సృజన కారుల అపార సాహితీ కృషిని మనం ఎట్లా విస్మరించ గలుగుతాం ?
ఈ ఒరవడి మీద యువసాహితీ వేత్తలు దృష్టి సారించాలి .సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా విస్తృతం కావాలి .దీనికి తగిన అధ్యయనాన్ని జోడించాలి .పుస్తకాలు కొని చదివే ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని సాహిత్యం లోకి తేవడానికి ప్రయత్నం జరగాలి .
తాత్కాలికం గా లభించే చప్పట్లు ,సన్మానాలు ,పురస్కారాలకు మాత్రమే కాకుండా చనిపోయిన తరువాత కూడా జీవించగలిగే గాఢత ఈ యువ సాహితీ వేత్తలు సంతరించు కోవాలి . తరం నుండి తరం వరకు ప్రవహించే కొద్దీ సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతుంది . వేల ఏండ్ల నాటి సాహితీకారులు ఇప్పటికీ సజీవం గా ఉన్నారు. కాలావధులకతీతం గా నడచే ఈ ప్రవాహం గాడమైన సృజన వల్ల నే సాధ్యమౌతుంది .
సాహితీవేత్తలు పొందే పురస్కారాల కు ఆక్షేపణ కాదిది .ఇవి కేవలం స్పూర్తి ని ఉత్సాహాన్ని మాత్రమె ఇస్తాయి .సాహితీకారున్ని నిలబెట్టేది సాధన, అధ్యయనమే.
యువలోకం ఈ దిశా గా అలోచించ గలదని ఆశిద్దాం .తెలంగాణ సాహితీ సరోవరం యువ రాజహంసలతో మరింత ఉజ్వలం కాగలదని ఆకాంక్షిద్దాం…..
జై తెలంగాణ, జై జాగృతి .